నామినేషన్ చివరి రోజు వరకు అభ్యర్థులను ప్రకటించకుండా నాన్చుడి ధోరణి అవలంభించే చంద్రబాబు ఈసారి ముందుగా మేల్కొంటున్నారు. నియోజకవర్గాలవారీగా చేస్తోన్న సమీక్ష సందర్భంగా అభ్యర్థులకు టిక్కెట్ ను ఖరారు చేస్తున్నారట. సర్వేల ఆధారంగా కొందర్ని పెండింగ్ లో ఉంచుతూ బలమైన అభ్యర్థులకు ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారట. అందుకే, మునుపటి చంద్రబాబు కాదంటూ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికలు చావోరేవో తేల్చుకునేవి. అందుకే, ఎక్కడా మొహమాటంలేకుండా పక్కా సర్వేల ఆధారంగా అభ్యర్థుల జాబితాను చంద్రబాబు తయారు చేస్తున్నారు. గతంలో కొన్ని బంధుప్రీత, స్నేహానికి, కొన్ని మీడియా సంస్థల ప్రమోషన్లకు టిక్కెట్లను ధారాదత్తం చేసే ప్రక్రియ ఉండేది. అలాంటి జాబితా నుంచి ఒకప్పుడు వచ్చిన వాళ్లే కొడాలి నాని, వల్లభనేని వంశీ, కదిరి బాబూరావు, నారాయణ తదితరులు. ఈసారి పార్టీ కోసం పనిచేసినోళ్లకే పక్కా సీటు అనే విషయాన్ని ముఖంమీదే చెప్పేస్తున్నారు. 40ఏళ్ల అనుభవాన్ని రంగరించడం ద్వారా గెలుపు గుర్రాలను రేస్ లోకి దించాలని చంద్రబాబు స్కెచ్ వేశారు.
బలమైన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిలుగా ఉన్న వాళ్లే అభ్యర్థులుగా ఖరారయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఆ కోవకు వచ్చే జాబితాలో సుమారు 70 మంది వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే స్పష్టంగా ఉన్న నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఉదాహరణకు రాజంపేట లోక్సభ , పత్తికొండ అభ్యర్థులను ప్రకటించారు అవనిగడ్డ స్థానం నుంచి మండలి బుద్ధప్రసాద్ తనయుడు పోటీచేస్తారని ప్రచారం నడుస్తున్నప్పటికీ వాటికి ఫుల్స్టాప్ పెడుతూ బుద్ధప్రసాదే రంగంలోకి దిగుతారని ప్రకటించారు. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, సంతనూతలపాడు నుంచి విజయ్కుమార్, మార్కాపురం నుంచి కందుల నారాయణరెడ్డి, రాజంపేట అసెంబ్లీ నుంచి బత్యాల చెంగల్రాయుడు, ఒంగోలు నుంచి దామచర్ల జానార్థన్, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియ, పుంగనూరు నుంచి చల్లా రామచంద్రారెడ్డి, గుంటూరు తూర్పు నుంచి మహ్మద్ నజీర్ పేర్లను ఇప్పటి వరకు చంద్రబాబు దాదాపుగా ఖరారు చేశారు.
నందికొట్కూరు ఎస్సీ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని నిలిపే బాధ్యతను గౌరు వెంకటరెడ్డికి అప్పగించారు. మైదుకూరు నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీ సీటు ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే, సుధాకర్ యాదవ్ ఆ సీటును బలంగా కోరుకుంటున్నారు. మూడు రోజులుగా చంద్రబాబు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో కొందరికి టిక్కెట్లను ఫైనల్ చేయగా, మరికొందరి జాబితను పరిశీలిస్తున్నారు. మొత్తం మీద గతానికి భిన్నంగా చంద్రబాబు 2024 ఎన్నికలకు సిద్ధం అవుతున్నారని పార్టీ వర్గాల్లోని టాక్. ఎంత వరకు ఆయన ముందస్తు వ్యూహం ఫలిస్తుందో చూడాలి.