రాయలసీమ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో తెలియచేసే ప్రయత్నం టీడీపీ చేస్తోంది. ఆ క్రమంలో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా ట్వీట్ల యుద్దానికి దిగారు. పాలకులు రాక్షసులు అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో చూడండి అంటూ పలు అంశాలను జోడిస్తూ ట్వీట్లు చేయడం వైసీపీకి ఆగ్రహం కలిగించింది. ప్రతిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. రాష్ట్రంలో గొడవల సృష్టించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్రలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించిన చంద్రబాబు ఇప్పుడు రాయలసీమను ఎంచుకున్నారని ఆరోపించారు. అందుకే అక్కడికి వెళ్లిన ఆయన రండి రా..చూసుకుందాం అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారని విమర్శించారు. అమరావతి కోసం రాయలసీమ వాసులు త్యాగం చేయరని సాయిరెడ్డి ట్వీట్ చేయడం ప్రాంతీయ విభేదాల వార్ కు ట్విట్టర్ వేదిక అయింది.
పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ. రాయలసీమలో నాడు మేము తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయి? పెట్టుబడులను తరిమేసింది ఎవరు? సీమ ద్రోహులు ఎవరు? సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా…లేక కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా?#JaganFailedCM pic.twitter.com/42GBIyVxWn
— N Chandrababu Naidu (@ncbn) November 21, 2022
పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో ఏపీ ఉదాహరణగా ఉందని చంద్రబాబు ఆరోపించారు. నాడు తన హయాంలో పరిశ్రమలు తీసుకొస్తే వాటిని నేడు వెళ్లిపోయేలా చేశారని ఆయన ప్రశ్నించారు. కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్లగొట్టిన జగన్మోహన్రెడ్డి సర్కార్ రాయలసీమకు ఏమీ చేయలేదని ట్వీట్టర్ వేదికగా చంద్రబాబు వివరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను మేపలేక జాకీ కంపెనీ పరార్ అయిందంటూ చంద్రబాబు ఒక పోస్టు పెట్టారు. అంతేకాదు, జగన్ పర్యటనకు నరసాపురంలో ఇష్టారాజ్యంగా చెట్లను నరికి వేశారని, ఆయన వస్తున్నారు అంటే అంతే అంటూ ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. ప్రతిగా ఏ మాత్రం తగ్గకుండా సాయిరెడ్డి ట్వీట్లను పెట్టారు.
Also Read: CM Jagan: నేడు నర్సాపురంలో సీఎం జగన్ పర్యటన.. ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన
ఏపీలో మూడు రాజధానుల్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ఇతర విపక్ష పార్టీలతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారని సాయిరెడ్డి అంటున్నారు. కర్నూలు, వైజాగ్ లో టీడీపీ శ్రేణులు కూడా భారీఎత్తున జనాన్ని కూడగడుతూ మూడు రాజధానులకు వ్యతిరేకంగా అల్లర్లకు కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు మీద ఆయన ట్వీట్ చేశారు. `రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి చంద్రం భారీ స్కెచ్ వేశాడని, అమరావతిని అంగీకరించాలంటూ ఉత్తరాంధ్రలో ఘర్షణలు లేపాలనిచూస్తే ప్లాన్ ఫ్లాప్ అయిందని, కర్నూలు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడని సాయిరెడ్డి ఆరోపించారు. మీరు కడుపు మాడ్చుకుని మాకు కమ్మని భోజనం వడ్డించండి` అనేలా చంద్రబాబు వాలకం ఉందని ఆయన విమర్శించారు.
ఒరేయ్ కిలాడి డ్రామూ! అమరావతి ఆగిపోవడంతో రాష్ట్రంలో ప్రజలు పిల్లల్ని కనడం ఆపేశారా? నీ పేపర్ చూసి జనం దేనితో నవ్వుతారో కూడా ఆలోచించవా? నీలో పచ్చ కుల పైత్యం బాగా ముదిరిపోయింది. మోకాలికి బోడి గుండుకు లింక్ పెడుతూ గాలి వార్తలు రాయడానికి అలవాటు పడ్డావు. pic.twitter.com/U1tJI51dt8
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 21, 2022
తిరుపతిలో నడి రోడ్డుపై మహిళ ప్రసవం గుండెను కలిచివేసిందని చంద్రబాబు పోస్టు పెట్టారు. స్థానికులు దుప్పట్లను అడ్డుపెట్టి ప్రసవం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. భారీ వృక్షాలను నరికేయడం, ఆస్పత్రుల్లో వసతులు లేకపోవడం, మూడు రాజధానులతో విద్వేషాలను రెచ్చగొడుతూ రివర్స్ రెడ్డిగా మారాడని సీఎం జగన్మోహన్రెడ్డి మీద చంద్రబాబు ట్వీట్లు చేస్తూ `ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి..` అంటూ హైలెట్ చేయడంతో సాయిరెడ్డి రంగంలోకి దిగారు. వాళ్లిద్దరి ట్వీట్ల యుద్ధం ఎండింగ్ ఎలా ఉంటుందో చూద్దాం!
Also Read: AP Politics : సంక్షేమంపై బాబు, పవన్ ఫిదా!