ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న వారణాసిలోని కాశి లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం తెలిసిందే. అయితే దివ్య కాశి భవ్య కాశి పేరిట సాగిన మోడీ పర్యటనను టీటీడి చానళ్ళైన ఎస్వీబీసీ లో ప్రసారం చేయలేదని కొందరు మీడియా ద్వారా ఆరోపించడం బాధాకరమని తిరుమల తిరుపతి దేవస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. టీటీడీ పై బురద చల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, వీటిని తాము ఖండిస్తున్నామని టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
దివ్య కాశి భవ్య కాశి కార్యక్రమాన్ని ఎస్వీబీసీ3, ఎస్వీబీసీ4 చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశామని.. శ్రీవారి కల్యాణోత్సవం తరువాత తెలుగు ఎస్వీబీసీ చానల్లోనూమోడీ కార్యక్రమం ప్రసరమైందని టీటీడీ వివరణ ఇచ్చింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాలపై ఆరోపణలు చేసేముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని హితవు పలికింది . ఆధ్యాత్మిక సంస్థ అయిన టీటీడీ పై అవాస్తవాలతో కూడిన ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలని సూచించింది.