TTD : అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేవంలో భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల్లో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు సీఎం ఎదుట ప్రజంటేషన్ ఇచ్చారు. శ్రీవారి లడ్డు, అన్నప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై అధికారులు నివేదిక అందించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు సాధారణ రోజుల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం సమీక్షించారు.
Read Also: Modi : మోడీ ఆ పని చేస్తే 10 లక్షల మందితో సభ పెట్టి సన్మానిస్తా – రేవంత్
రాష్ట్రం వెలుపల నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిపై అధికారులు నివేదిక అందించారు. తిరుమల ప్రతిష్ఠ పెంచడంతో పాటు భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు కనిపించేలా మాడవీధుల్లో ఏర్పాట్లను అధికారులు వివరించారు. అలిపిరిలో ఉన్న భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధికి ప్రణాళిక, అమరావతిలో శ్రీవారి ఆలయం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. వీటికి సంబంధించిన నమూనాలను ఆయన పరిశీలించారు.ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.