తిరుమల శ్రీవారికి చరిత్రలో జులై నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. జులై నెలలో 23.40లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. జులై నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.139.33 కోట్లు సమకూరింది. ఈ నెలలోనే 1.07 కోట్ల శ్రీవారి లడ్డూలు విక్రయించారు. జూలై నెల మొత్తం శ్రీవారికి 10.97లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మార్చిలో 19.72 లక్షల మంది నుంచి రూ.128.61 కోట్లు, ఏప్రిల్లో 20.62 లక్షల మంది ద్వారా రూ.127.63 కోట్లు హుండీ ఆదాయం సమకూరింది. అలాగే మే నెలలో 22.68 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా రూ.130.29 కోట్లు లభించింది. జూన్ నెలలో 23.23 లక్షల మంది భక్తులు రూ.123.74 కోట్ల కానుకలు సమర్పించారు. జూన్లో హుండీ ఆదాయం కాస్త తగ్గినప్పటికీ, మే నెలలో రికార్డుగా ఉన్న రూ.130.29 కోట్లను జూలైలో దాటేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. బుధవారం తిరుమల శ్రీవారిని 74,497 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.