Ticket Rates Drama : తాడేపల్లిలో పెద్ద హీరోల డ్రామా ?

మొత్తానికి ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడింది ... అని మీడియా ముందు అగ్రహీరోలు ప్రకటించేశారు.

  • Written By:
  • Updated On - February 11, 2022 / 11:07 AM IST

మొత్తానికి ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడింది … అని మీడియా ముందు అగ్రహీరోలు ప్రకటించేశారు.చిన్న సినిమాల కోసం ఐదో ఆటకు అంగీకరించిన ముఖ్యమంత్రికి థాంక్స్ అని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన దాన్ని బట్టి టిక్కెట్ల రేట్లు పెంచుకోడానికి ప్రభుత్వం అంగీకరించిందనే విషయం అందరికీ అర్ధమయ్యింది. నిజానికి పెద్ద హీరోల గొడవ టిక్కెట్ల రేట్ల పెంపు కోసం కాదు … తెలంగాణలో నూటయాభై ఉంది బాల్కనీ టిక్కెట్లు ఏపీలో నూట పది రూపాయలు ఉంది … నలభై రూపాయల గొడవగా దీన్ని చూపించే ప్రయత్నం పెద్ద హీరోలు చాలా కాలంగా చేస్తున్నారు.కానీ విషయం అది కాదు …దీని వెనకాల ఉన్న మతలబు ఏమిటంటే?

పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు మొదటి వారం టిక్కెట్ల ధరలు పెంచుకోడానికి ప్రభుత్వం అనుమతించాలి అనే …అలాగే నంబర్ ఆఫ్ షోస్ వేసుకునే ఛాన్స్ ఇవ్వాలి … అలాగే బెన్ ఫిట్ షోస్ వేసుకోడానికి అనుమతివ్వాలి … ఈ డిమాండ్ల గురించి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం తో సమస్య పరిష్కారం అయిపోయిందని పెద్ద హీరోలు ప్రకటించేసినట్టున్నారు అని బయట వినిపిస్తున్న మాట. నిజానికి ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల రేట్ల నియంత్రణ, అమ్మకం ప్రభుత్వం చేపడుతుందని ప్రకటించిన్నప్పుడు పిసుక్కు చచ్చింది ఇందుకే . ఇలా అయితే …పెద్ద సినిమాలు తీయలేమని పరిశ్రమ వైపు నుంచీ సన్నాయినొక్కులు నొక్కారు అందరూ ..దీని మీద ప్రభుత్వం కూడా తన వాదనను వినిపించింది.అయితే మూడు నాలుగు లేయర్లలో కథలు నడపడానికి అలవాటు పడ్డ సినిమా వాళ్లు … వ్యూహాత్మకంగా ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీ పట్ల దారుణంగా వ్యవహరిస్తోందనీ …ఇలా అయితే … తెలుగు సినిమా రంగం షట్ డౌన్ అయిపోతుందని ముఖ్యమంత్రి అర్ధం చేసుకోవాలనీ … ఆక్రోశించారు.

ఇదందా ఉత్తుత్తి ఏడుపులే …
నిజానికి వాళ్ల గొడవ కేవలం తమ సినిమాలకు టిక్కెట్ల ధరలు ఇష్టానుసారం పెంచుకోడానికి అనుమతించమనే …పైగా టిక్కెట్ల రేట్లు పెంచుకోడానికి పరిశ్రమ వారికి అవకాశం ఇవ్వాలని ప్రజలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేంతగా ఈ డ్రామాను రక్తి కట్టించారు సినిమా వాళ్లు.విషయాన్ని తెగేదాకా లాగడం సరికాదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్ సినీనటులను చర్చలకు పిల్చాడు పాపం .టిక్కెట్ల ధరల వ్యవహారంలో సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అదే సందర్భంలో తన మనసులోని మరో కోరికను వీరి ముందుంచారు సిఎం.ఒక్క తెలంగాణలోనే కాదు …ఏపీలో కూడా చిత్ర పరిశ్రమ వర్ధిల్లాలి కదా … అందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికి తగిన సదుపాయాలు కల్పించడానికి తమ ప్రభుత్వం సిద్దంగా ఉన్నదని చాలా పెద్దమనసుతో ప్రతిపాదించారు.ఈ అవకాశాన్ని కూడా తమకు అనుకూలంగా వాడుకోడానికి తప్పకుండా సిఎంగారు ప్రతిపాదించిన విషయాన్ని పరిశీలిస్తాం … ఇక్కడ కూడా పరిశ్రమ ఏర్పాటుకు మేం దోహదం చేస్తాం అని ప్రకటించేశారు మెగాస్టార్ చిరంజీవి.హైద్రాబాద్ లో స్థలాలు గట్రా తీసుకున్నది చాలక … ఇప్పుడు ఏపీలోనూ మళ్లీ స్థలాలు పొందేయడానికి రడీ అయిపోయారు. ఎక్కడైనా మేమే అన్నట్టు వ్యవహరించారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలకు అద్దం పట్టే సినిమాలు తీసే కళాకారులకు తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తే … వారు ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ వేళ్లూనుకోడానికి దోహదపడతారు. అలా కాక మళ్లీ అక్కడా వీళ్లకే పెద్ద పీట వేస్తే జరిగే ప్రయోజనం ఏమీ ఉండదని పాపం ముఖ్యమంత్రిగారికీ తెల్సు.

అందరూ తోడు దొంగలు కదా..
ఏపీ లో కూడా వీళ్ళే దందా నడుపుతారని మెగాస్టార్ చిరంజీవి మాటలు విన్న చాలా మంది ఔత్సాహికులు వాపోతున్నారు.మరో వైపు టిక్కెట్ల రేట్లు పెంచడం పెద్ద సినిమాలకు ప్రయోజనకరం కావచ్చేమోగానీ …చిన్న సినిమాల పాలిట పాపమే అంటున్నారు సీనియర్ నిర్మాత దర్శకులు.తెలంగాణలో టిక్కెట్ల రేట్లు పెంచడం వల్లా చాలా మంది ప్రజలు ఇటీవల విడుదల చేసిన చిన్న సినిమాలను కనీసపు చూపు కూడా చూడలేదనేది వాస్తవం.కనుక చిన్న సినిమాను చంపేసే నిర్ణయం ప్రభుత్వం తీసుకునేలా ఒత్తిడి తెచ్చిన ఈ పెద్ద హీరోలు …చిన్న సినిమాలకూ అన్న ఆ ఐదో షోని కూడా తామే తినేస్తారు అనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు.

ఫైనల్ గా జరిగేది అదే …
ఒకప్పుడు రోజుకు మూడాటలు ఆదివారం పండుగ రోజుల్లో నాలుగాటలూ అని ఉన్న థియేటర్లలో ప్రతి రోజూ నాలుగాటలు అంటూ నూన్ షోస్ కాన్సెప్టును తీసుకువచ్చినప్పుడు దాన్ని చిన్న సినిమాల కోసమే అని చెప్పారు.నిజానికి అలా ఆ రోజుల్లో అనేక చిన్న సినిమాలు నూన్ షోస్ గా విడుదలై … పెద్ద విజయాలు సాధించాయి. అలాంటి వాటిలో … దాసరి నీడ ఉంది … బి.నరసింగరావు తీసిన మా భూమి ఉంది . కన్నడ నుంచీ డబ్ అయి వచ్చిన అపరిచితులు ఉంది . తమిళం నుంచీ డబ్ అయి వచ్చి సక్సస్ అయిన మౌైనగీతం ఉంది … ప్రేమసాగరం ఉంది … ఇలా పట్టుమని పదేళ్లు కూడా కొనసాగాకుండా … రోజుకు నాలుగాటలూ పెద్ద హీరోల సినిమాలే … వేసేసే పద్దతి తీసుకువచ్చారు.
అలా చిన్న సినిమాను మింగేశారు. రేపు జరగబోయేదీ అదే అన్నది ఇండస్ట్రీలో చిన్న సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్న నిర్మాత దర్శకుల అభిప్రాయం. ఇలా ఏపీలో సినిమా పరిశ్రమ అభివ్రుద్ది చేసే బాధ్యతనూ ఐదో ఆట హామీనీ పొంది దాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలి అనే ఆలోచనలతో హ్యాపీగా అగ్రహీరోలు హైద్రాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు.

– సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ భ‌ర‌ద్వాజ రంగ‌వ‌ఝల ఫేస్‌బుక్ పేజీ నుంచి సేక‌ర‌ణ‌