ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీలో అభ్యర్థుల మార్పు శరవేగంగా జరుగుతుంది. దాదాపుగా 100 మంది అభ్యర్థులకు స్థాన చలనం కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు స్థాన చలనం కలిగింది. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారిని సమన్వయ కర్తలుగా నియమించగా.. మరికొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వేరే నియోజకవర్గాల్లో నియమించారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలను మారుస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీగా అభ్యర్థుల మార్పు ఉండబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సర్వేలు, పని తీరు ఆధారంగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామంటూ ఎమ్మెల్యేలకు తెలిపుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడానికి అధినేత నిరాకరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై గ్రౌండ్ లెవల్లో పూర్తిస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను నియోజకవర్గాల మార్పిడి చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొక్కిలిగడ్డ రక్షణనిధి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఆయన కూడా తిరువూరు నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేరు. స్థానిక నేతలతో ఎమ్మెల్యే రక్షణనిధికి తీవ్రవిభేదాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన ఆయన్ని స్థానిక నేతలే ఓడించేలా ఉన్నారని సర్వేల్లో తెలింది. ఈ నేపథ్యంలో తిరువూరు వైసీపీకి కొత్త సమన్వయకర్తను నియమించాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. రేసులో మాజీ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతితో పాటు.. చిత్తూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సామన్య కిరణ్ పేరు వినిపిస్తుంది. గతంలో ఆమె 2014లో మధిర అసెంబ్లీ నిమోజకవర్గంలో వైసీపీ తరుపున చురుగ్గా కార్యక్రమాలు చేశారు. ఆ తరువాత ఆమె చిత్తూరుకి వెళ్లారు. చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆమె 2014లో పోటీ చేసి ఓడిపోయారు. తరువాత సంతనూతలపాడు అదనపు సమన్వయకర్తగా 2016 నుంచి ఉన్నారు. అయితే ఆమెకు గత ఎన్నికల్లో ఎక్కడా టికెట్ లభించలేదు.ఈ ఎన్నికల్లో ఆమెను బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. తిరువూరు వైసీపీ అభ్యర్థిగా ఆమె పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Also Read: AP : రేవంత్ బాటలో జగన్..సంక్రాంతి నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం..?