తిరువూరు మున్సిపాలిటీలో అధికార పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయిలో చేరింది. మున్సిపల్ ఛైర్పర్సన్కి వ్యతిరేకంగా ఎమ్మెల్యే రక్షణనిధి వర్గం వ్యవహరిస్తుంది. మున్సిపల్ ఛైర్పర్సన్ని తప్పించాలని గత కొద్ది రోజులుగా అధికార పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ గత్తం కస్తూరి భాయి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆమె కీలక ప్రకటన చేశారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆమె తెలిపారు. గతంలోనే తాను ఛైర్పర్సన్ పదవి ఆశించి కౌన్సిలర్ గా పోటీ చేసి విజయం సాధించానని.. రెండో సారి కౌన్సిలర్ గా గెలిచిన తాను ఛైర్పర్సన్ పదవి ఇవ్వమని కోరగా ఎమ్మెల్యే రక్షణనిధి నిరాకరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ కలిసి విజ్ఞప్తి చేయగా తనకు ఛైర్పర్సన్ పదవి ఇచ్చారని ఆమె తెలిపారు. పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎమ్మెల్యే రక్షణనిధి తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. మాల సామాజికవర్గం అంటే ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి చిన్నచూపు చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రతి ప్రోగ్రాంలో తనను ఎమ్మెల్యే రక్షణ నిధి అవమానపరిచేవారిని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరికైనా చెప్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందని తాను అన్ని అవమానాలు భరించానని ఛైర్పర్సన్ కస్తూరిభాయి తెలిపారు. 16 మంది కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రక్షణనిధి బలవంతంగా సంతకాలు చేయించారని… మా 16 మంది కౌన్సిలర్లు తన వెనుకే ఉన్నారని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తేనే రాజీనామా చేస్తానని.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలకు న్యాయం చేస్తుంటే, ఇక్కడ ఎమ్మెల్యే రక్షణ నిధి దానికి విరుద్ధంగా చేస్తున్నారని తెలిపారు. కరపత్రాలు పంచిన వారికి తమకు దైవ సాక్షిగా సంబంధం లేదన్నారు. కరపత్రాలు పంచిన వారిపై చర్యలు తీసుకోవాలని తాను కూడా కోరుతున్నానని తెలిపారు.