Tirumala Leopards DNA : ఆగస్టు నెలలో తిరుమల మెట్ల దారి మీదుగా వెళ్తున్న నాలుగేళ్ల బాలికపై చిరుత పులి దాడిచేసి హతమార్చిన విషాద ఘటన గురించి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక కొత్త అప్ డేట్ వచ్చింది. బాలికను హతమార్చిన తర్వాత అటవీ అధికారులు బోనులో బంధించిన మొత్తం నాలుగు చిరుతల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ ను సేకరించారు. వాటిని డీఎన్ఏ టెస్టు కోసం ముంబైలోని ల్యాబ్కు పంపగా, రెండు చిరుతల డీఎన్ఏ రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయి. చిన్నారిపై జరిగిన చిరుత దాడికి.. తొలుత బోనులో చిక్కిన రెండు చిరుతలకు సంబంధం లేదని వెల్లడైంది. చిరుత గోళ్లు, రక్త నమూనాల ఆధారంగా రూపొందించిన డీఎన్ఏ రిపోర్ట్ లతో ఈవిషయం నిర్దారణ అయింది. దీంతో ఆ రెండు చిరుతల్లో ఒకదాన్ని విశాఖ జూ పార్క్కు, మరోదాన్ని నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు విడిచిపెట్టారు.
Also read : Mahesh Babu: మహేష్ బాబుతో అర్జున్ రెడ్డి డైరెక్టర్ మూవీ.. స్టోరీ లైన్ ఇదే..!
ఇక మిగిలిన రెండు చిరుతలకు సంబంధించి డీఎన్ఏ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. రావాల్సి ఉన్న డీఎన్ఏ రిపోర్టుతో సంబంధం లేకుండా.. ఈ రెండు చిరుతలను తిరుపతి జూ పార్క్లోనే ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. పళ్ళు ఊడినందున.. వాటికి స్వతహాగా వేటాడే సామర్థ్యం తగ్గిందని తెలుస్తోంది. కాగా, చిరుత దాడిలో చిన్నారి మృతి ఘటన తరువాత రెండు రోజుల్లో (ఆగ్టసు 14న) ఒక చిరుత బోనులో చిక్కింది. ఆగస్టు 17న మరో చిరుత బోనులో చిక్కింది. ఆగస్టు చివరి వారంలో ఇంకొక చిరుత చిక్కింది. అంతకుముందు మూడు నెలల క్రితం ఒక చిరుత బోనులో (Tirumala Leopards DNA) చిక్కింది. ఈవిధంగా మొత్తం నాలుగు చిరుతలు అటవీ అధికారుల ట్రాప్ లో చిక్కాయి.