Site icon HashtagU Telugu

Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీకి బిగిస్తున్న ఉచ్చు? అరెస్టుకు రంగం సిద్ధం?

Vallabhaneni Vamsi Arrest

Vallabhaneni Vamsi Arrest

Vallabhaneni Vamsi Arrest: హడావుడి అవసరం లేదు. హంగామా చేయొద్దు. వాస్తవాలు అన్ని త్వరలో బయట పడతాయి. విచారణలో సత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. టైమ్‌ చూసి ఒక్కొక్కరిని ఆధారాలతో సహా మూసేద్దామని పక్కా ప్లాన్‌ను ఇంప్లిమెంట్‌ చేస్తుంది కూటమి సర్కార్. కొడాలి నాని చుట్టూ కేసులు వేయబడుతుండగా, ఇప్పుడు వంశీని పక్కాగా ఫ్రేమ్ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం అవుతుంది అని తెలుస్తోంది.

లేటెస్ట్‌గా అసెంబ్లీ వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలతో వల్లభనేని వంశీకి భయం మొదలయింది. మైలవరంలో మట్టి తవ్వకాలపై, గన్నవరం మాజీ ఎమ్మెల్యేపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందని, త్వరలోనే చర్యలు తీసుకుంటాం అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ, విజిలెన్స్ విచారణ పూర్తి అయ్యాక సీఐడీ విచారణ కూడా జరిపేందుకు ఆదేశిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

గత ప్రభుత్వంలో మట్టి, గ్రావెల్‌ తవ్వకాల్లో జరిగిన దోపిడీకి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వల్లభనేని వంశీ ప్రమేయం ఉందన్న అలిగేషన్స్‌తో విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు 179 మందిపై కేసులు నమోదయ్యాయి మరియు రూ.90.38 కోట్ల రికవరీ కోసం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో వంశీకి ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది. విజిలెన్స్ రిపోర్ట్‌ రాగానే, సీఐడీకి అప్పగించి, మట్టి తవ్వకాలపై వంశీ మీద కేసు నమోదు చేసి, అరెస్ట్‌ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో, గన్నవరం నియోజకవర్గంలో వంశీకి అత్యంత నమ్మకమైన ఆరుగురు అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో వారిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత, ఆ తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై అటాక్‌ కేసు A1గా ఉన్న వల్లభనేని వంశీని కూడా అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

గన్నవరం లో కనపడని వంశీ:

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం కోర్టుకు హాజరుకావడం తప్ప, గన్నవరం వెళ్లడం లేదు. అతను డిసెంబర్‌లో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కోర్టులో విచారణకు హాజరుకాబోతున్నాడని సమాచారం. ఈ సమయానికే వంశీపై మరిన్ని కేసులు నమోదవుతాయని అనుకుంటున్నారు. ఒకవైపు గన్నవరం టీడీపీ నేతపై దాడి కేసు, మరోవైపు మట్టి తవ్వకాలపై విజిలెన్స్ విచారణ, ఇలా వరుసగా కేసులు వంశీని చుట్టుముట్టే అవకాశం ఉంది.

వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేతలలో కొడాలి నాని తరువాత వంశీ కూటమి ప్రభుత్వ టార్గెట్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. అంతేకాక, నారా భువనేశ్వరి గురించి చేసిన కామెంట్లతో వంశీ తీవ్ర విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. ఈ అంశంలో కూడా త్వరలో అతనిపై కేసులు నమోదవుతాయనే ప్రచారం ఉంది.

“తన తల్లిని అవమానిస్తే ఊరుకోవాలా?” అంటూ మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావించవచ్చు. వంశీ చేసిన వ్యాఖ్యలపై దృష్టి పెట్టి, లోకేశ్‌ తీవ్ర చర్యలు తీసుకుంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో, భువనేశ్వరి పై వంశీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో భారీ దుమారం రేపిన విషయం. అప్పటి నుంచి, టీడీపీ క్యాడర్ వంశీ మీద మండిపడుతోంది. టీడీపీ పెద్దలు, మంత్రి లోకేశ్‌ కూడా వంశీ మీద సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, వంశీపై వరుస కేసులు, అరెస్టు సంబంధిత చర్చలు టీడీపీ వర్గాల్లో పెరిగాయి.