AP BRS: రాష్ట్రంలో మధ్యం,గంజాయి విచ్చలవిడిగా లభ్యమౌతున్నా ఏమాత్రం పట్టనివైకాపా సర్కార్ సంక్షేమం పేరుతో సంక్షోభ పాలన కొనసాగిస్తుందని బిఆర్ఎస్ ఎపి చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. మంగళవారం గురజాల ,విజయవాడ నియోజకవర్గాలకు చెందిన తెల్లపోగు ఆదాం,ఉమామహేశ్వరరావు ,నాగేళ్ల కోటేశ్వరరావు,ఎం.బి.చంద్రపాల్ సహా పలు జిల్లాలకు చెందిన నేతలు తోట సమక్షంలో భారాస తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సంధర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి యువతకు ఉపాధి హామీలు కల్పించక వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నవరత్నాల పేరుతో ప్రజల్ని నయవంచన చేస్తూ రాష్ట్రాన్ని దివాళా దిశగా తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ , ప్రభుత్య ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దయనీయ స్తితి ఎపి లో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ రాక్షస పాలనలో అన్నీ రంగాలు నిర్వీర్యమైయ్యాయని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఎపి లో కెసిఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ ప్రత్యామ్న్యయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Uppal Stadium: వరల్డ్ కప్ కు ముస్తాబవుతున్న ఉప్పల్ స్టేడియం, 2.5 కోట్లతో ప్రత్యేక వసతులు