Tirupati Stampede: తిరుప‌తిలో తొక్కిసలాట.. ఆ 15 మంది పాత్ర ఏంటి? కుట్ర ఉందా?

భక్తులు ఒక్క సారిగా తోసుకురావడంతో వారిని ఒక పద్ధతి ప్రకారం మరింత ముందుకు తోసి మహిళలపై పడేలా చేసింది కూడా ఈ యువకులే అనే విషయం పోలీసులుకు స్పష్టంగా తెలిసింది.

Published By: HashtagU Telugu Desk
Tirupati Stampede

Tirupati Stampede

Tirupati Stampede: తిరుమల వైకుంఠ దర్శన టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో అపశృతి (Tirupati Stampede) చోటు చేసుకుంది. దీనికి కారణం ఏమిటనే విషయం పరిశీలిస్తే పలు విషయాలు వెల్లడి అవుతున్నాయి. తిరుపతిలో గురువారం ఉదయం 5 గంటల నుంచి 9 ప్రదేశాల్లోని 94 కౌంటర్ల ద్వారా టికెట్లు ఇస్తారని ముందుగా టిటిడి ప్రకటించింది. అయితే బుధ‌వారం సాయంత్రం 5 గంటల నుంచే టికెట్లు ఇస్తున్నారు అంటూ కొంత మంది తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు.
ఆ కంగారులో ఒకేసారి భక్తులు బుధవారం సాయంత్రమే లైన్ లోకి వచ్చి నిలుచున్నారు. ఇదే సమయంలో కొంత మంది అక్కడి సిబ్బందితో, పోలీసులతో కావాలని గొడవ పెట్టుకుని, ఒకరిపై ఒకరు తోపులాట మొదలుపెట్టారు. దాంతో ఒక్కసారిగా లైన్ లో భక్తుల మధ్య తోపులాట ప్రారంభం అయింది.

క్యూ లైన్ లో ఉన్న ఒక మహిళ అస్వస్థతకు గురి కావటంతో ఆ మహిళని బయటకు తీసుకుని రావటానికి పోలీసులు గేటు ఓపెన్ చేసారు. ఇదే సమయంలో పద్మావతి పార్కులో వేచి ఉన్న భక్తులు క్యూలైన్‌లోకి రావాలని కొంత మంది పెద్ద పెద్దగా అరుస్తూ కేక‌లు వేశారు. ఈ కేకలు విని ఒకేసారి భక్తులు శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం టికెట్ కేంద్రాల వద్దకు వచ్చేశారు. దీంతో ఒకేసారి మూడు ప్రాంతాల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో అనేక మంది అస్వస్థతకు గురై, ఆరుగురు చనిపోయారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు.

Also Read: YS Jagan London Tour : జగన్ కు సీబీఐ కోర్టు గుడ్ న్యూస్

అయితే ఇందులో అనేక కుట్ర కోణాలు బయట పడుతున్నాయి. ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టు పోలీసులు, విజిలెన్స్ అనుమానిస్తుంది. రేపు టికెట్లు ఇస్తుంటే, ఈ రోజే టికెట్లు ఇస్తున్నారని ప్రచారం చేసింది ఎవరు? ఒక బులుగు మీడియాలో ఈ ప్రచారం ఎందుకు వచ్చింది? క్యూలైన్ లో కావాలని గొడవ పెట్టుకుంది ఎవరు? కావాలని తోపులాట ఎందుకు చేసారు? పద్మావతి పార్కులో వేచి ఉన్న భక్తుల గేటు ఓపెన్ చేసి, క్యూలైన్ లోకి వెళ్ళాలని చెప్పింది ఎవరు? ఇవన్నీ పోలీసులు, విజిలెన్స్ వివిధ సిసిటీవీ ఫూటేజ్ లు పరిశీలిస్తున్నారు. దీంట్లో ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీసే పనిలో పోలీసులు ఉన్నారు.

ఈ మొత్తం దుర్ఘటనకు స్థానికంగా ఉన్న 15 మంది యువకులు కారణంగా పోలీసులు చెబుతున్నారు. పార్కులో ఉన్న వారిని క్యూలైన్ లోకి తెచ్చేందుకు అరిచి కేకలు వేసింది.. ఆ తర్వాత ఒక మహిళను కాపాడేందుకు పోలీసులు గేటు తెరిస్తే టిక్కెట్లు ఇస్తున్నారని చెప్పింది కూడా ఈ 15 మంది యువకులేననే విషయం ప్రాథ‌మికంగా తెలిసింది. భక్తులు ఒక్క సారిగా తోసుకురావడంతో వారిని ఒక పద్ధతి ప్రకారం మరింత ముందుకు తోసి మహిళలపై పడేలా చేసింది కూడా ఈ యువకులే అనే విషయం పోలీసులుకు స్పష్టంగా తెలిసింది.

  Last Updated: 09 Jan 2025, 01:01 PM IST