Tehsildar Murdered : ల్యాండ్ మాఫియా బరితెగించింది. శుక్రవారం అర్ధరాత్రి ఏకంగా తహసీల్దార్పై దాడి చేసి దారుణంగా హత్య చేసింది. దీంతో విశాఖలో కలకలం రేగింది. కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్లో తహసీల్దార్ రమణయ్య నివసిస్తుండే వారు. శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ అపార్ట్మెంటుకు వచ్చారు. ఆ వెంటనే తహసీల్దార్ కూడా కిందకు వచ్చారు. కొద్దిసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆ దుండగుడు తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్తో తహసీల్దార్ తలపై దాడి(Tehsildar Murdered) చేశారు. ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. ఆయన్ను అపార్ట్మెంట్వాసులు వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ తహసీల్దార్ రమణయ్య చనిపోయారు.దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకున్నాడు.
We’re now on WhatsApp. Click to Join
రెండు రోజుల క్రితం వరకు రమణయ్య విశాఖ రూరల్ తహసీల్దార్గా పనిచేశారు. ఇటీవలే విశాఖ రూరల్ నుంచి విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు. రమణయ్య విధుల్లో చాలా నిజాయితీగా ఉండేవారని చెబుతుంటారు. భూముల విషయంలో వివాదంతోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఈ హత్య జరిగిన టైంలో అపార్ట్మెంటు దగ్గర నలుగురు ఉన్నారని.. వాచ్మెన్ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారని చెబుతున్నారు. మరోవైపు తహసీల్దార్పై రాడ్తో దాడి చేసిన సమయంలో దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. తహసీల్దార్ రమణయ్యది శ్రీకాకుళం జిల్లా కాగా.. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మట్టి మాఫియా రెచ్చిపోయింది. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న టీడీపీ వర్గీయులపై ఇటీవల విచక్షణారహితంగా దాడికి తెగబడింది. వెంటాడి మరీ తీవ్రంగా గాయపర్చింది. వారి కార్లు, ద్విచక్రవాహనాలను ధ్వంసం చేసింది. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూస్తూ మిన్నకుండి పోయారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలవరం కుడికాల్వ పెదవేగి మండలంలో 20కిలోమీటర్ల పైగా వెళ్తోంది. కాల్వ ఇరువైపులా భారీగా గట్టు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈగట్టే మట్టి మాఫియాకు కాసులు కురిపిస్తోంది. గత మంగళవారం రాత్రి 11గంటల సమయంలో పెదవేగి మండలం లక్ష్మీపురం సమీపంలో పోలవరం కుడికాల్వ గట్టును అక్రమంగా తవ్వేస్తున్నారనే సమాచారంతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి వెళ్లారు. అప్పటికే మూడు ఎక్స్కవేటర్లతో గట్టును తవ్వేస్తూ 14 డంపర్లతో మట్టిని తరలిస్తున్నారు. ప్రభాకర్ రాకను గమనించిన తవ్వకందారులు వాహనాలను వదిలి పారిపోయారు. ఏలూరు ఆర్డీవో ఎన్ఎస్కే.ఖాజావలికి, పోలీసులకు చింతమనేని సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చిన తర్వాత మట్టి తరలిస్తున్న వాహనాలను అప్పగించాలని తన అనుచరులతో చెప్పి వెళ్లిపోయారు.సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వచ్చిన దెందులూరు ఎస్ఐ కె.స్వామి, వాహనాల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. అదే సమయంలో మట్టి మాఫియా సభ్యులు భారీ సంఖ్యలో తిరిగి వచ్చి…టీడీపీ వర్గీయులపై దాడికి తెగబడ్డారు.