Pemmasani Chandrasekhar ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై పార్లమెంటులో చర్చ వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా ఏపీకి చెందిన ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులు గత వైసీపీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడిన నాటకానికి ఈ బిల్లుతో తెరపడిందని వారు స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ, “పులివెందుల ఎమ్మెల్యే జగన్.. మీ ఊసరవెల్లి రాజకీయాలు ఇకపై సాగవు” అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అమరావతిని ఏకగ్రీవంగా అంగీకరించిన తర్వాత, జగన్ తన రంగు మార్చి మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చారని విమర్శించారు. ఈ అశాస్త్రీయ ప్రతిపాదనను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఈ చారిత్రాత్మక బిల్లుతో అమరావతికి శాశ్వత, చట్టపరమైన భద్రత లభించిందని, ఇకపై రాజధానిని అంగుళం కూడా ఎవరూ కదల్చలేరని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరావతి రైతులు పడిన కష్టాలను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 29 వేల మంది రైతులను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని అవమానించారని, మహిళలని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1631 రోజుల పాటు సాగిన ఉద్యమంలో రైతులపై మేకులున్న లాఠీలతో దాడి చేశారని, గర్భిణులను బూట్ల కాళ్లతో తన్నారని, వారి భోజనంలో ఇసుక పోసి హింసించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ తల్లుల కన్నీళ్లే ఈరోజు ఈ చట్టానికి పునాదిరాళ్లుగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు.
మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, రాష్ట్ర భవిష్యత్తును, ఐదేళ్ల అమూల్యమైన కాలాన్ని వృథా చేసిందని ఎంపీలు ఆరోపించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు గ్రోత్ ఇంజన్లుగా ఉన్నాయని, ఏపీకి కూడా అలాంటి ఒకేఒక శక్తిమంతమైన రాజధాని అవసరమని వారు నొక్కిచెప్పారు. రాజధానిని నిర్ణయించే అధికారం కేవలం పార్లమెంటుకే ఉందని హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు గుర్తుచేశారు. ఈ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఉన్న అన్ని రకాల ఊహాగానాలకు తెర పడుతుందని, పెట్టుబడిదారులకు నమ్మకం కలిగి రాష్ట్ర అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని వారు అభిప్రాయపడ్డారు.
