తెలుగుదేశం పార్టీ చరిత్రను మలుపు తిప్పిన రోజు 1982, డిసెంబర్ 16వ తేదీ. సరిగ్గా ఆ రోజున అన్న ఎన్టీఆర్ చైతన్య రథం ఎక్కాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదాన్ని ఆ రథం మీద నుంచి వినిపించాడు. నిర్విరామంగా 19 రోజుల పాటు ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని చైతన్య రథం చుట్టేసింది. అన్న ఎన్టీఆర్ ప్రసంగాలు తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించాయి. ఇసుకేస్తే రాలనంత జనం మధ్య నుంచి ఎన్టీఆర్ చైతన్య రథం ముందుకు కదిలిన రోజు అది.
చైతన్య రథం ద్వారా ప్రజల వద్దకు ప్రచారాన్ని ఎన్టీఆర్ తీసుకెళ్లాడు. అప్పటి వరకు ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ చూడలేదు. సరికొత్త రాజకీయ ప్రస్తానానికి నాంది పలుకుతూ అన్న ఎన్టీఆర్ డిసెంబర్ 16న రథం బయలుదేరింది. ఢిల్లీ పెత్తనం గురించి ఊరూరా ఎన్టీఆర్ తెలియచేశాడు.
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వేళ్లూనుకుని ఉంది. దాని కూకటి వేళ్లను పెకలించేలా అన్న ఎన్టీఆర్ ప్రసంగం ప్రతి గ్రామానికి వెళ్లింది. ఏక బిగిన కేవలం 19 రోజులు సాగిన నందమూరి తారక రామారావు చైతన్య రథం ప్రచారం, ఆయన ఇచ్చిన ఆత్మగౌరవ నినాదం బాగా పనిచేసింది. వేళ్లూనుకున్న కాంగ్రెస్ మహావృక్షాన్ని ప్రజలు కూల్చేశారు. తెలుగుదేశం పార్టీని 202 సీట్లతో తెలుగు ప్రజలు గెలిపించారు. ఒక చరిత్రను సృష్టించారు.
ఒక నూతన రాజకీయ వ్యవస్థకు పునాది రాయిని తెలుగు ప్రజలు వేశారు. అంతటి మహత్తరమైన డిసెంబర్ 16వ తేదీ ఇవాళ. ఆ తేదీ స్వర్గీయ ఎన్టీఆర్ కు అంకితమై పోయింది. అందుకే, డిసెంబర్ 16 తేదీని 1982లో ఎన్టీఆర్ తో ఉన్న సీనియర్లు ఎవరూ మరువలేరు. ఆ తేదీని ఆ పార్టీలోని సీనియర్లు మననం చేసుకోకుండా ఉండలేరు. తెలుగుదేశం పిలుస్తోంది!రా కదలిరా!! అంటూ ప్రతి గ్రామంలోనూ ప్రచారం జరిగింది.