మహానాడు వేదిక ఫిక్స్ అయింది. రైతులు ముందుకు రావడంతో ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెం వద్ద స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ప్రభుత్వం ఒంగోలులోని స్టేడియం ఇవ్వడానికి నిరాకరించింది. ఆ క్రమంలో రైతులు తమ పొలాలను ఇవ్వడానికి ముందుకు రావడం గమనార్హం. మళ్లీ ఈ రాష్ట్రానికి పూర్వస్థితి రావాలంటే టీడీపీ అధికారంలో రావాలని కోరుకుంటూ మండువవారి పాలెంలో రైతులు మహానాడు ఏర్పాటు చేసుకోవడానికి సొంత భూములను ఇచ్చారు.
గతంలో మహానాడు మూడు రోజులు ఉండేది. ఈ సారి ఎండలు అధికంగా ఉండడంతో రెండు రోజులకు పరిమితం చేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 27న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 10 వేల మందితో సభ నిర్వహిస్తుంది. ఆ రోజు 17 తీర్మానాలు ప్రవేశ పెట్టడానికి టీడీపీ నిర్ణయం తీసుకుంది.
అలాగే, ఈనెల 28నసాయంత్రం 3 గంటలకు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా ఆ పార్టీ ప్లాన్ చేసింది. అంతేకాదు, ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభించబోతోంది. కాగా, మహానాడులో మాట్లాడాల్సిన అంశాలపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు బ్లూప్రింట్ సిద్ధం అయింది.