విజయనగరం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురైయ్యాడు. తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన యెగిరెడ్డి కృష్ణ అనే టీచర్ని అదే గ్రామానికి చెందిన వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు రాజకీయమే కారణమని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నలుగురు వ్యక్తుల్ని విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన మరడాన మోహన్రావు, రెడ్డి రాము, మరడాన వెంకట నాయుడు, మరడాన రామస్వామిలను అదుపులోకి తీసుకున్నారు. ఉద్దవోలు గ్రామంలో రాజకీయ ఆధిపత్యం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.ప్రభుత్వ ఉపాధ్యాయుడు యేగిరెడ్డి కృష్ణ గత రెండు దశాబ్దాలుగా టీడీపీ సానుభూతిపరుడిగా తన స్వగ్రామమైన ఉద్దవోలులో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని ఆమె తెలిపారు. దీంతో తన ప్రత్యర్థి అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు మరడాన వెంకట్నాయుడుతో శత్రుత్వం ఏర్పడిందని.. ఉపాధ్యాయ నియామకానికి సంబంధించి కృష్ణపై వెంకట్నాయుడు ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు చేశారని ఎస్పీ తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉపాధ్యాయుడు కృష్ణ పరోక్షంగా మద్దతు ఇచ్చిన సునీతపై వెంకట్ నాయుడు ఓటమి పాలయ్యారు. ఆ తరువాత తనకు కాంట్రాక్టు పనుల బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నాడనే కక్షతో హత్య చేసినట్లు పోలీసుల విచారణ వెల్లడైంది.