రాష్ట్రంలో గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారునాయక్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక పులివెందులస్వామ్యమా అని ఆయన ప్రశ్నించారు. సమస్యలపై గళం విప్పితే పోలీసులతో ఇళ్లకు నోటీసులు పంపుతామన్నట్లు ప్రభుత్వ పెద్దల వ్యవహరిస్తున్నారన్నారు. ఒక గిరిజనుడిగా గిరిజన సమస్యలపై మాట్లాడితే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నాపై కేసుపెట్టి పోలీసులను పంపడం ఎంతవరకు సబబు? అని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు కరువై కొండ, గుట్టల్లో కొట్టుమిట్టాడుతున్న గిరిజనుల సమస్యలపై మాట్లాడే హక్కు మాకు లేదా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకలను రద్దు చేస్తే మేం ప్రశ్నించకూడదా? బాధ్యయుతమైన ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్న పీడిక రాజన్నదొర అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పోలీసులను పంపడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో గిరిజనులపై రోజుకొక దాడి జరుగతోందని.. గిరిజనుల మాన, ప్రాణాలకు విలువ లేకుండా పోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం గిరిజనులపై అక్రమంగా, అన్యాయంగా మోపుతున్న కేసులపై జాతీయ ఎస్టీ కమీషన్లో పిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. పోలీసులను పంపి అరెస్టులు చేస్తామంటే గిరిజన సమస్యల గురించి మాట్లాడటం మానేస్తామని ప్రభుత్వం అనుకుంటుందని.. ఎన్ని కేసులు పెట్టిన గిరిజనుల సమస్యలపై గళం విప్పుతామని ఆయన తెలిపారు.
TDP : గిరిజన సమస్యలపై మాట్లాడితే అక్రమ కేసులు బనాయిస్తారా ? – టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధారు నాయక్

TDP