Andhra Pradesh : హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదా..?

ఏపీలో వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎమ్ఎస్ రాజు ఆరోపించారు. రాష్ట్రంలో

  • Written By:
  • Publish Date - November 16, 2023 / 09:30 AM IST

ఏపీలో వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎమ్ఎస్ రాజు ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై దాడి జరగని రోజు లేదని.. అసాంఘిక శక్తులు మొదలు కొని పోలీసులు దాక అనునిత్యం ఏదో ఒక రూపంలో దళితులపై దాడులు చేస్తూనే ఉన్నారని ఆయ‌న ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, దొమ్మెరుకు చెందిన దళిత యువకుడు బొంత మహింద్రను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేసి దాడికి పాల్పడ్డారన్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక మహీంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని ఎమ్ఎస్ రాజు తెలిపారు. దళితులంటే వైసీపీ నాయకులకు, పోలీసులకు లెక్కలేకుండా పోయిందన్నారు. దీనంతటికీ కారణం సీఎం జగన్ రెడ్డి ఉదాసీన వైఖరేన‌ని.. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అఘాయిత్యాలు, అరాచకాలు నిత్యకృత్యంగా జరుగుతూ ఉన్నా చర్యలు శూన్యమ‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మొన్న నందిగామలో శ్యామ్ పై జగన్ సామాజికర్గానిక చెందిన యువకులు మూత్ర విసర్జన చేసి అవమానించారని.. దళితుడిని చంపి డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇప్పించి పార్టీ సభలు, సమావేశాల్లో జగన్ తన పక్కనే తిప్పుకుంటున్నారన్నారు. సీఎం సొంత నియోజకవర్గ కేంద్రంలోనే దళిత మహిళ నాగమ్మ పై అత్యాచారం చేసి హత్య చేసినా చర్యలు లేవన్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి కూతవేటు దూరంలో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనలో అసలు నిందితుడు వెంకట్ రెడ్డిని ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు.

Also Read:  TDP : బీటెక్ రవి అక్రమ అరెస్ట్ వైసీపీ కక్ష సాధింపు చర్య : టీడీపీ నేత బీద ర‌విచంద్ర

హోం మంత్రి దళితురాలై ఉండి దళితులకు ఒరిగింది ఏమిటీ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మహేంద్రను అకారణంగా అదుపులోకి తీసుకుని వేధిస్తున్నారని, విడిపించాలని మహేంద్ర కుటుంబ సభ్యులు వైసీపీ పెద్దలను ప్రాధేయపడినా కనికరించలేదని.. వైకాపా దళిత మంత్రులు ఉన్నది జగన్ రెడ్డికి బాకా ఊదడానికా? లేక ప్రజలను రక్షిచడానికా? అని ప్ర‌శ్నించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 28 మంది దళితులను పొట్టనబెట్టుకున్నారని.. ఆరు వేల మంది దళితులపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. దళితులు నా మేనమామలు అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపైన్నే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని.. విదేశీ విద్య, ఎన్టీయార్ స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవలబుల్ స్కూల్స్ వంటివాటిని రద్దు చేసి దళితులు విద్యా పరంగా ఎదగకుండా అడ్డుకున్నారని ఎమ్ఎస్ రాజు ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారులు, రాజ్యసభ సభ్యుల నియామకంలో దళితులకు అన్యాయం చేశారని.. సలహాదారులుగా దళితులు పనికిరారంటూ అసెంబ్లీ సాక్షిగా దళిత జాతిని జగన్ అవమానించారన్నారు. దళితులను అన్ని విధాల వేధిస్తున్న జగన్ రెడ్డికి దళితులు బుద్ది చెప్పాలని ఎమ్ఎస్ రాజు పిలుపునిచ్చారు.