కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రాష్ట్రానికి నిథులు ఇస్తున్నా.. వాటని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ అభిప్రాయ పడింది. ఉండవల్లిలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రానున్న పార్లమెంట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్ర పథకాలకు విరివిగా నిధులు ఇస్తుందని.. అయితే నేడు రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడం వల్ల అనేక పథకాలు నిలిచిపోయాయని టీడీపీ ఎంపీలు తెలిపారు. దీని వల్ల అంతిమంగా రాష్ట్ర ప్రజలు నష్టపోయారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ద నిధుల సద్వినియోగంపై లేదని నేతలు అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు గాడి తప్పి వ్యవహరిస్తున్న విధానాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. అన్ని విధాలా విఫలమైన జగన్ ప్రభుత్వం ఓట్ల జాబితాలో అక్రమాల ద్వారా లబ్ది పొందాలని చూస్తుందని.. ఈ అంశంపై డిల్లీలో గళం వినిపించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, విభజన చట్టం హామీల సాధనలో విఫలమవడం వంటి అంశాలను లేవనెత్తాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావన ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు.
Also Read: TTD : తిరుమల శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం.. నవంబర్ నెలలో 108 కోట్ల రూపాయల విరాళాలు