మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ని అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సీఎంలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గోడలు దూకి, తలుపులు పగల గొట్టి నర్సీపట్నంలో బీసీ నేత అయ్యన్న పాత్రుడి ని, ఆయన కుమారుడిని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. అధికారంలో వచ్చిన నాటినుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోందని…ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారని చంద్రబాబు అన్నారు. నాడు ఇంటి నిర్మాణాలు కూల్చి వేత మొదలు…అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని.. చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సిఐడి విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదన్నారు. దొంగల్లా పోలీసులు ఇళ్లమీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీ పై బీసీ నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్న అరెస్టు అని చంద్రబాబు పేర్కొన్నారు. అక్రమం గా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడు, రాజేష్ లను విడుదల చేయాలని డిమాండ్ చంద్రబాబు చేశారు.