విజయవాడ ఎంపీ కేశినేని నాని సొంతపార్టీపై తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచనప్పటి నుంచి ఆయనకు పార్టీకి మధ్య గ్యాప్ వచ్చింది. దీనికి కారణం పార్లమెంట్ పరిధిలో ఉన్న కొంత మంతి అగ్రనేతలేనని ఎంపీ వర్గీయులు చెప్తున్నారు. తాజాగా ఆయన మైలవరం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తనకు టికెట్ నిరాకరించినా అభ్యంతరం లేదని, స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసేందుకు సిద్ధమని టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకుంటే తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన మాటలను పార్టీ ఎలా తీసుకుంటుందోనని భయపడేది లేదని, అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఎలాంటి ఆటంకాలు ఉండవని కేశినేని నాని స్పష్టం చేశారు. తాను ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, అభివృద్ధి కోసం దేనికైనా ఓకేనని అభిప్రాయపడ్డారు.