విజయవాడ ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. సొంతపార్టీ నేతలతో పాటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. పార్టీలో కమర్షియల్ నాయకులను దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే వారికే గుర్తింపు ఉంటుందన్నారు. ఎక్కడో కూర్చుని మీసం మెలేసి.. తొడలు కొడితే నాయకులు కారని.. ప్రజల్లో ఉంటే నాయకులగా గుర్తింపు వస్తుందని సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు.చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో పార్టీలోని నేతలంతా కలిసి పని చేయాలని సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ నిర్ణయం జరిగినా అందరి అంగీకారం మేరకే జరిగిందని చెప్పారు.
అయితే ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలు పని చేస్తున్నారు. కేశినేని శివనాథ్ పేరుతో దసరా శుభాంకాంక్షలతో ఎంపీ నాని ఫోటో లేకుండా వీరి ఫోటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. తాజాగా జరిగిన ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎంపీ కేశినేని నాని ఫోటోలు మాత్రమే కనిపించాయి. పోటీపోటీగా వెస్ట్ నియోజకవర్గంలోని టీడీపీలోని రెండు వర్గాలు ఇలా ఫ్లెక్సీల్లో ఒకరి ఫోటోలు లేకుండా ఒకరు వేయించుకోవడంపై జోరుగా చర్చ జరుగుతుంది.