MLC Panchumarthi : వచ్చే ఎన్నికల్లో మొట్ట మొదట ఓడిపోయేది మంత్రి ఆర్‌కే రోజానే : టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి కామెంట్స్‌

రాష్ట్రాన్ని పాడుపడ్డ కొంపలా తయారు చేసిన హీన చరిత్ర సీఎం జగన్ రెడ్డిదేనని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

  • Written By:
  • Publish Date - December 16, 2023 / 08:53 AM IST

రాష్ట్రాన్ని పాడుపడ్డ కొంపలా తయారు చేసిన హీన చరిత్ర సీఎం జగన్ రెడ్డిదేనని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. వైసీపీ పాలనలో మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి ఎప్పుడైనా వీటిపై సమీక్ష చేశారా? ఎవరికైనా న్యాయం చేశారా? అని ఆమె ప్ర‌శ్నించారు. కల్తీ మద్యం, ల్యాండ్ కబ్జాలు, అప్పులు, అత్యాచారాల్లో ఏపీ నెం.1 స్ధానంలో ఉంటే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటంలో అధమ స్ధానంలో ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలపై 223 అత్యాచారాలు జరిగినా ఏం చర్యలు తీసుకోలేదని కేంద్రానికి స్వయంగా సాంఘిక సంక్షేమశాఖ నివేదిక ఇవ్వటం సిగ్గుచేటన్నారు. సిగ్గు అనే పదం వైసీపీ బ్లడ్ లోనే లేదన్నారు. టీడీపీ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు, డ్వాక్రా, విద్య, వైద్యం అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేశామ‌ని.. చంద్రబాబు హయాంలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు భయంతో ఉరి వేసుకున్నాడని గుర్తు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

వైసీపీ ప్రభుత్వం అంటే ఎవరికి భయం లేదు, నమ్మకం లేదన్నారు. మహిళా సంక్షేమం అన్న జగన్ రెడ్డి మహిళా సంహారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి గంటకు ఒక లైంగిక వేధింపు, ప్రతి 3 గంటలకు ఒక హత్య, ప్రతి 8 గంట ఒక రేప్ ప్రతి 12 గంటకు ఒక కిడ్నాప్ జరుగుతున్నాయని.. రోజుకు 9 మంది బాలికలు, 20 మంది మహిళలు మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయని పంచుమ‌ర్తి తెలిపారు. 55 నెలల వైసీపీ పాలనలో 1 లక్షా 48 వేల నేరాలు మహిళలపై జరిగితే ఏం చర్యలు తీసుకున్నారని ఆమె ప్ర‌శ్నించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ కి గురైన బాధితురాలిని పరామర్శించడానికి చంద్రబాబు వెళ్తే వాసిరెడ్డి పద్మ చంద్రబాబును విమర్శించటం సిగ్గుచేటన్నారు.

Also Read:  Hostages Killed : టెన్షన్‌లో ఇజ్రాయెలీ సైనికులు.. ముగ్గురు ఇజ్రాయెలీ బందీల కాల్చివేత

జగన్ రెడ్డికి ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపై ఉన్న శద్ర పాలనపై లేదని.. . గుంటూరులో రమ్య, నరసరావు పేటలో బీటెక్ విద్యార్ది అనూష, పులివెందులలో నాగమ్మపై ఇలా ఎన్నో అత్యాచారాలు జరిగాయని.. వీటిపై సమాధానం చెప్పకుండా దిశ చట్టం తెచ్చామంటున్నారన్నారు. రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ముందే అత్యాచారం జరిగిందని.. దీనిపై ప్రశ్నించిన ఎమ్మెల్యే భవానిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం తప్ప బాధిత మహిళకు ఏం న్యాయం చేశారని ఎమ్మెల్సీ పంచుమ‌ర్తి అనురాధ ప్ర‌శ్నించారు. మంత్రి రోజాకు నిభంధనలకు విరుద్దంగా రుషికొండలో సీఎంకి ఇల్లు కేటాయించటంపై ఉన్న శ్రద్ద మహిళలపై లేదా అని ప్ర‌శ్నించారు. వచ్చే ఎన్నికల్లో మొట్ట మొదట ఓడిపోయేది రోజానేన‌ని ఆమె జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మహిళలంతా టీడీపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని వైసీపీకి డిపాజిట్లు కూడా రావని అనురాధ అన్నారు.