TDP MLAs: జగన్ బ్రాండ్స్ తో జనం పిట్టల్లా రాలుతున్నారు!

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీ వల్ల రాష్ట్రంలో పేదవారు

  • Written By:
  • Updated On - March 16, 2022 / 10:40 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీ వల్ల రాష్ట్రంలో పేదవారు చనిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు టీడీపీ ప్రజా ప్రతినిధులు జంగారెడ్డిగూడెంకు వెళ్లి మృతుల కుటుంబాలను ఓదార్చి వచ్చామ‌ని.. జంగారెడ్డిగూడెం మరణాలపై దృష్టి సారించి విచారణ చేపడితే జగన్ బ్రాండ్స్ మద్యం సేవించి జనం పిట్టల్లా రాలిపోతున్నట్లు తేలిందన్నారు.

ఏలూరు జనరల్ ఆస్పత్రిలో 15 రోజుల్లో జగన్ జే బ్రాండ్స్ తాగి అనేకమంది చనిపోయినట్లు సాక్ష్యాధారాలున్నాయని.. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని అచ్చెన్నాయుడు తెలిపారు. బ్రాండ్స్ పై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి ఎక్కడ తప్పు జరుగుతోందో తప్పక తేలుస్తామని… జగన్ తెచ్చిన బ్రాండ్స్ మద్యం తాగి అనేకమంది చనిపోతుంటే ప్రభుత్వం దాన్ని బయటికి రాకుండా దాచుతోందని ఆయ‌న ఆరోపించారు. పేదవాడు జగన్ బ్రాండ్లను కొనలేక కల్తీ సారాతాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నార‌ని… డాక్టర్లను భయపెట్టి తప్పుడు రిపోర్టులు తెప్పించుకున్నా నిజం నిత్యం దాగదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్యంపై ప్రజల్లో దుష్ప్రచారం చేశారని.. ఇప్పుడు అధికారంలోకి రాగానే దశలవారీగా మద్యపాన నిషేదం విధిస్తానని చెప్పి ఏకంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వ‌జ‌మెత్తారు.

జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 27 మంది చనిపోయిన నిజాలను వదలకుండా వెలికితీస్తామ‌ని పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు తెలిపారు. జగన్ బ్రాండ్స్ తో రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది చనిపోతున్నారని.. దశలవారీగా మద్యపాన నిషేదం విధిస్తానని చెప్పిన జగనే ఇప్పుడు పూటుగా తాగించి కూలీల ప్రాణాలు హరిస్తున్నార‌నన్నారు. మద్యం వల్ల రూ.30 వేల కోట్ల అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని నిమ్మ‌ల రామానాయుడు ఆరోపించారు. ఉద్యోగాలు లేక యువత కల్తీసారా, గంజాయి, హెరాయిన్ బాటపడుతోందని… కల్తీసారా మరణాలపై దృష్టి పెట్టడంతో వాస్తవాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయన్నారు.