MLC Anuradha : లేని స్కిల్ సెంటర్‌కు బోర్డు ఎందుకు మార్చారు.. ప్ర‌భుత్వానికి ఎమ్మెల్సీ పంచుమ‌ర్తి అనురాధ ప్ర‌శ్న‌

చంద్రబాబు నాయుడిపై పెట్టిన అక్రమ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పవని

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 04:08 PM IST

చంద్రబాబు నాయుడిపై పెట్టిన అక్రమ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పవని భావించి జగన్‌రెడ్డి కొత్తకొత్త తుగ్లక్ ఐడియాలకు తెరలేపారని ఎమ్మెల్సీ పంచుమ‌ర్తి అనురాధ తెలిపారు. వైజాగ్‌లోని ఆంధ్రయూనివర్శిటీలోని సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బోర్డు తీసేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన (పిఎంకేవీవై) అనే బోర్డు తగిలించారని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటే తప్పని చెప్పిన వైసీపీ ప్రభుత్వం పి.ఎం.కె.వీ.వై పేరు ఎలా పెట్టారని ఆమె ప్ర‌శ్నించారు. ప్రధానమంత్రి పేరు పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని.. నిన్నటి వరకు రాష్ట్రంలో ఎక్కడా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ లేదని చెప్పిన జగన్ రెడ్డి ప్రభుత్వం నేడు అదే సెంటర్‌కు ప్రధాని పేరు ఎలా పెట్టారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. స్కిల్ ని స్కామ్ అని, రాష్ట్రం మొత్తం మీద ఒక్క స్కిల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదని.. ఇప్పడు అదే సెంటర్లకు ప్రధాని పేరు, ఫోటో పెట్టడం విడ్డూరంగా ఉంద‌న్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ సెంటర్లలో ఒక్క పరికరం పెట్టలేదన్నారని.. ఇప్పుడు అదే స్కిల్ సెంట‌ర్‌లో ప్రధాని పేరు, ఫోటో పెట్టార‌ని తెలిపారు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన నీకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి లేద‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబునాయుడు మచ్చలేని చంద్రుడుగా, కడిగిన ముత్యంలా తిరిగి వస్తున్నారని జగన్‌మోహ‌న్ రెడ్డి ఒణికిపోతున్నార‌ని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని కోర్టులు తేల్చబోతున్నాయని తలంచిన జగన్ మోహ‌న్ రెడ్డి ప్రధానమంత్రి ఫోటో పెట్టుకుని తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో భాగమే విశాఖలో సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు పిఎంకేవీవై బోర్డు తగిలించారని ఆరోపించారు. 31 కేసుల్లో జగన్‌రెడ్డి ఇరుక్కుని, ఆ కేసుల్లో పదేళ్లుగా బైలుపై తిరుగుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు లేకపోతే నిలువనీడ లేని జగన్‌రెడ్డి కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డార‌ని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై కనీసం అవగాహన లేని వైకాపా మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. పోలవరానికి ఎన్ని గేట్లు ఉన్నాయో తెలియని మంత్రి, కాపులను ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడిన మంత్రి, పూజారులను కొడితే తప్పేంటన్న మంత్రి, తెలుగు గానీ… ఇంగ్లీషు గానీ రాని మంత్రి, సన్న బియ్యం ఇవ్వకలేని మంత్రులు నిస్సిగ్గుగా స్కిల్ డెవలప్‌మెంట్‌పై మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. స్కిల్ కేసుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఈ మంత్రులు ఆంధ్రా యూనివర్శిటీలోని సీమెన్స్ స్కిల్ డెవపల్‌మెంట్ సెంటర్‌కు బోర్డు ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలన్నారు. నోరుంది కదా అని మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని పంచుమ‌ర్తి అనురాధ హెచ్చ‌రించారు.

Also Read:  Krishna Water Share : కేసీఆర్, జ‌గ‌న్ `మిలాక‌త్` కు కృష్ణా వాటాతో కేంద్రం చెక్

యువత భవిష్యత్తు కోసం ఉన్నత లక్ష్యాలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై అవినీతి ముద్ర వేసి కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సీమెన్స్‌తో ఒప్పందం చేసుకుని స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించిన 14 రాష్ట్రాలలో.. అక్కడ ఏ ముఖ్యమంత్రికి కనిపించని అవినీతి జగన్ మోహన్ రెడ్డి ఒక్కడికే కనిపిస్తోంద‌న్నారు. సాక్షాత్తు నేటి ప్రధాని.. నాడు గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోదికి సైతం ఎలాంటి అవినీతి కనిపించలేదన్నారు. కానీ సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మాత్రం లేని, జరగని అవినీతి కనిపిస్తోంద‌ని మండిప‌డ్డారు.