ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఈ రోజు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ పోటీలో ఉన్నారు. దీంతో వైసీపీ అధిష్టానంలో టెన్షన్ మొదలైంది. ఒక్కో అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంది. పార్టీ ఫిరాయించిన వారిని తీసేస్తే 19 మంది బలం టీడీపీకి ఉంది. అయితే వైసీపీలో అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్లో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వ్యాఖ్యలు చేయడం వైసీపీలో ఆందోళన కలిగిస్తుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనూ టీడీపీ చరిత్ర సృష్టిస్తుందని ఎమ్మెల్యే నిమ్మల అన్నారు. అంతరాత్మ ప్రభోదానుసారం వైసీపీ ఎమ్మెల్యేలు తమకే ఓటు వేయబోతున్నారని.. రహస్య ఓటింగ్లో ఎవరికి ఓటు వేశారో తెలిసే అవకాశమే లేదన్నారు. పట్టభద్రుల ఎన్నిక తర్వాత వైసీపీ ముగినిగోయే నావ అని గ్రహించారని.. ఎమ్మెల్యే కోటాలో ఝులక్ ఇస్తేనే జగన్ మారతాడనే భావనలో చాలామంది ఉన్నారని నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు చేశారు.