ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అనంతపురం జిల్లా జడ్పీ (ZP Office) ఆఫీసులోని ఛైర్పర్సన్ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) ఫోటో ఉంచడం వివాదాస్పదంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, సురేంద్రబాబు (MLAs MS Raju, Daggubati Venkateswara Prasad, Surendra Babu) తీవ్రంగా స్పందించారు. “ఇది ప్రభుత్వ కార్యాలయమా? లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసా?” అంటూ వారు ప్రశ్నించారు.
Vizag Steel Plant : నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల
అధికారిక ప్రభుత్వ భవనాల్లో తాత్కాలికంగా అధికారంలో లేకపోయినా, మాజీ నేతల ఫోటోలు పెట్టడం సరికాదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ముఖ్యంగా పబ్లిక్ ఆఫీసుల్లో ఇటువంటి చర్యలు ప్రజాప్రతినిధుల విలువలను దిగజార్చేలా ఉంటాయని విమర్శించారు. “జగన్కి ఎవరైనా అభిమానులైతే వారి ఇంట్లో, పూజ గదిలో ఫోటో పెట్టుకోవచ్చు. కానీ ప్రజల సొమ్ముతో నడిచే ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం ఇలా చేయొద్దు” అని తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యలతో అక్కడ వాతావరణం కొంత ఉద్రిక్తతకు దారితీసింది.
టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహానికి స్పందించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకుని, జగన్ ఫోటోను కార్యాలయం నుంచి తొలగించారు. దీనిపై సోషల్ మీడియా మరియు రాజకీయ వర్గాల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు చెందినవని, అవి ఏ ఒక్క పార్టీకి కాకుండా అందరికీ సమానంగా ఉండాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.