తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా మే నెలలో నిర్వహించే ‘మహానాడు’ వేడుకలకు ఈసారి వేదిక మారే సూచనలు కనిపిస్తున్నాయి. తొలుత ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో మే 27, 28, 29 తేదీల్లో ఈ పసుపు పండుగను నిర్వహించాలని పార్టీ అధిష్టానం భావించింది. దీనికి సంబంధించి ప్రాథమిక కసరత్తు కూడా పూర్తయింది. అయితే, అనూహ్యంగా ఇప్పుడు వేదికను శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో పార్టీని మరింత బలోపేతం చేయాలని భావించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వేదిక మార్పు దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ పర్యటనే ప్రధాన కారణమా?
వేదిక మార్పు ఆలోచన వెనుక ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్నట్లు సమాచారం. జూన్ నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉత్తరాంధ్రలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఒకే సమయంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన అధికారిక ఏర్పాట్లు, మరోవైపు భారీ ఎత్తున లక్షలాది మంది తరలివచ్చే మహానాడు నిర్వహణ ఉంటే.. భద్రత, రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఇటు ప్రభుత్వం, అటు పార్టీ యంత్రాంగం భావిస్తోంది. అందుకే పరిపాలనాపరమైన, సమన్వయ లోపాలు తలెత్తకుండా ఉండటానికే నెల్లూరును ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఉత్తరాంధ్ర నేతల రియాక్షన్ ఏంటి?
ప్రస్తుతం టీడీపీ అధిష్టానం నెల్లూరులో మహానాడు నిర్వహణకు ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అక్కడ రవాణా సౌకర్యాలు, వేదికకు అనువైన ప్రదేశాలు, మరియు నేతల మధ్య సమన్వయంపై దృష్టి సారించింది. గతేడాది రాయలసీమలోని కడపలో మహానాడు విజయవంతం కావడంతో, ఈసారి నెల్లూరులో నిర్వహిస్తే దక్షిణ కోస్తాలో పార్టీకి మరింత ఊపు వస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే, సిక్కోలులో మహానాడు నిర్వహిస్తారని ఆశించిన ఉత్తరాంధ్ర నేతలు ఈ మార్పుపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వేదిక ఎక్కడైనా సరే, ఎన్నికల దిశగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఈ పసుపు పండుగను ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
