Site icon HashtagU Telugu

TDP Mahanadu 2023: సైకో జగన్ ఏపీని నాశనం చేశాడు : చంద్రబాబు

Tdp Mahanadu

Tdp Mahanadu

TDP Mahanadu 2023 : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సైకిల్ రెడీగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సంపద సృష్టించడం తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదని… 2029 నాటికి ఏపీని ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి శివారు వేమగిరిలో జరుగుతున్న మహానాడులో (TDP Mahanadu) ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహానాడు (TDP Mahanadu) ప్రారంభోత్సవం సందర్భంగా వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, ఇతర నాయకులు పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. సైకో జగన్ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడని..  నష్టపోయిన రాష్ట్రాన్ని వచ్చే ఐదేళ్లలో గట్టెక్కిస్తామని చంద్రబాబు  తెలిపారు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి, రివర్స్ పాలన చేస్తున్నాడని దుయ్యబట్టారు. పోలవరంను గోదావరిలో కలిపేశాడని, రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read : Prashant Kishor: నితీష్ పరిస్థితి చంద్రబాబుల మారబోతుంది: పీకే

కేసుల కోసం కేంద్రం ముందు తల వంచాడు : చంద్రబాబు

తండ్రిలేని బిడ్డను అని చెప్పుకుని, కోడికత్తి డ్రామా ఆడి, బాబాయ్ హత్య వంటి వాటితో జగన్ అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను తెస్తానని చెప్పిన జగన్… కేసుల కోసం కేంద్రం ముందు తల వంచాడని ఎద్దేవా చేశారు.ఈ నాలుగేళ్లలో రూ. 10 లక్షల కోట్ల అప్పు చేశారని చంద్రబాబు  మండిపడ్డారు. దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి జగన్ అని… రాష్ట్ర ప్రజలు మాత్రం పేదరికంలో మగ్గిపోతున్నారని అన్నారు. టీడీపీ కార్యకర్తల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివని, వారిని పార్టీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అంతా సంకల్పం తీసుకోవాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. రానున్న ఎన్నికలకు సంబంధించి రేపు (ఆదివారం) టీడీపీ ఎన్నికల ఫేజ్-1 మేనిఫెస్టోను ప్రకటిస్తామని  చెప్పారు. రానున్న ఎన్నికలు కురక్షేత్ర సంగ్రామం అని.. ఆ యుద్దంలో వైసీపీ కౌరవులను ఓడించి గౌరవ సభను ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు.