అనుకున్నట్లే బెజవాడ టీడీపీలో వర్గపోరు మరింత ముదిరిపోయింది. ఇన్నాళ్లు చాపకింద నీరులా ఉన్న ఈ వర్గపోరు లోకేష్ యువగళం పాదయాత్ర ముందు బయటపడుతుంది. విజయవాడ పార్లమెంట్లో సిట్టింగ్ ఎంపీ ఉండగానే మరో నేతను అధిష్టానం ప్రోత్సహించడం ఎంపీ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంపీ కేశినేని నానిని కాదని ఆయన సోదరుడు కేశినేని చిన్నిని విజయవాడ పార్లమెంట్లో అధిష్టానం తిప్పుతుంది. దీనికి జిల్లాలోని ఓ మాజీమంత్రి, ఇతర నేతలు సహకరిస్తున్నారు.ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఎంపీ వర్గీయులు తాజాగా యువగళం పాదయాత్రలో ఫ్లెక్సీల విషయంలో వర్గపోరు బయటపడింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఈ నెల 19వ తేదీన విజయవాడలో ప్రవేశిస్తున్న సందర్భంగా తెలుగు తమ్ముళ్లు మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి.
బ్యానర్ లు కట్టే విషయంలో టీడీపీ నాయకులు కరిముల్లా, పడాల వాసులు రోడ్డున పడి ఒకరికొకరు కొట్టుకున్నారు. మొన్న కేశినేని నాని వర్గంగా, నిన్న కేశినేని చిన్ని వర్గం అంటూ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డ్రామాలాడుతున్నారని బహిరంగంగానే టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఈ గొడవలకు గద్దె రామ్మోహన్ కారణమయ్యారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా మాట్లాడుకొంటున్నారు. టీడీపీ బలంగా ఉన్నామని చంకలు గుద్దుకొనే విజయవాడలోనే ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏంటా అని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. సిట్టింగ్ ఎంపీ ఉన్న సరే ఆయన మీద నమ్మకం లేక పాదయాత్ర బాధ్యతలు కేశినేని చిన్ని కి టీడీపీ అధిష్టానం అప్పజెప్పిందని ప్రచారం జరుగుతుంది . ఇలా టీడీపీ వారి నాయకుల మధ్య వారే విబేధాలు సృష్టించి వారు కొట్టుకుంటూ గొడవలు పడుతూ శాంతిభద్రతలకి విఘాతం చేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.