ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. దోపిడీ వ్యవస్థకు జగన్ అధిపతి అని, యువతను దెబ్బతీయడమే జగన్ క్రిమినల్ ఆలోచన అని విమర్శించారు. మచ్చలేని చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని.. స్కిల్ డెవలెప్మెంట్ లో అవినీతి జరగలేదని సీమన్స్, డిజైన్ టెక్ సంస్థలే చెప్తున్నాయని యనమల స్పష్టం చేశారు. సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని తప్పుడు ఆరోపణలతో మచ్చలేని చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. రాష్ట్రానికి ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన వ్యక్తిని జైల్లో పెట్టినందుకు ప్రజలే స్వచ్ఛందంగా నిరసన తెలుపుతున్నారని.. స్కిల్ డెవెలెప్మెంట్ పథకం మంచి పథకమని.. ప్రపంచంలోనే ఒక మంచి సంస్థ సీమన్స్ కంపెనీ అని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడానికి రాష్ట్రానికి ఈ సంస్థను తీసుకొచ్చామని… స్కిల్ డేవెలెప్మెమెంట్ కు యువత వేలకువేలు ఖర్చు చేయాల్సి వస్తుందని.. అందువల్లే తక్కువ ఖర్చుతో సీమన్స్ సంస్థ ద్వారా పేద యువతకు ట్రైనింగ్ ఇస్తే ఉద్యోగాలొస్తాయన్న ఉద్దేశంతో స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని యనమల తెలిపారు
తండ్రి అధికారంతో వేలకోట్లు దోచుకున్న జగన్ ఒక గజదొంగ..దాన్ని తాము గతంలోనే నిరూపించామన్నారు. గజదొంగకు తాళాలు ఇస్తే ఎలా ఉంటుందో జగన్ సీఎం కాకముందే చూపించారని… రూ.43 వేల కోట్ల ఆస్తులను సీబీఐ అటాచ్ చేసిందని గుర్తు చేశారు. ఈడీ ఛార్జ్ షీట్, సీబీఐ ఛార్జ్ షీట్లు 26 ఉన్నాయని..16 నెలలు జైల్లో జగన్ ఉన్నారన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఇప్పటి వరకు రూ.2.5 లక్షల కోట్లు ప్రజాధనం స్వాహా చేశారని… ఈ గజదొంగ గ్యాంగ్ ఇసుక, మైన్స్, లిక్కర్ ద్వారా దోచుకుంటున్నారని యనమల ఆరోపించారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చేవన్నీ వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని యనమల ఆరోపించారు.రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని.. అంతా రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుందన్నారు.