TDP : ఏపీ డీజీపీకి టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య‌ లేఖ.. పోలీసుల‌పై దాడులు చేస్తున్న వైసీపీ నేతల్ని..?

రాష్ట్రంలో వైసీపీ నాయకులు పోలీసులపై దాడికి పాల్పడుతున్నారంటూ ఏపీ డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 07:55 AM IST

రాష్ట్రంలో వైసీపీ నాయకులు పోలీసులపై దాడికి పాల్పడుతున్నారంటూ ఏపీ డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో అధికారపార్టీ నేతలు పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారనే వార్త ఒక మాజీ పోలీసు అధికారిగా త‌న‌కు బాధకలుగిస్తోందని లేఖ‌లో ప్ర‌స్తావించారు. పోలీసులపై దాడులు జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయనడానికి నిదర్శనమ‌న్నారు. కడపలో అనిల్ కుమార్ అనే పోలీసు అధికారిపై స్థానిక వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడటం దుర్మార్గమ‌ని.. అనిల్ కుమార్ భార్య న్యాయం చేయాలంటూ పబ్లిక్‌గా రోధిస్తూ 100కు డెయిల్ చేయడం హృదయవిదారకమ‌న్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్న ఇటువంటి ఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో ఇదే కడపలో హైమావతి అనే సర్కిల్ ఇన్ప్సెక్టర్ ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే ఆమెపై దాడికి పాల్పడ్డారని.. బలవంతంగా ఆమె పిర్యాదును వెనక్కు తీసుకునేలా చేశారని లేఖ‌లో పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా మూకవరపాడులో వైసీపీ ఎంపీ బంధువులు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లపై దాడికి పాల్పడ్డారని.. సత్యసాయి జిల్లా, మోటుకుపల్లిలో వైసీపీ ఎంపీపీ భర్త వేణుగోపాల్ రెడ్డి అనే కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డార‌ని తెలిపారు. ధర్మవరం వైసీపీ నాయకులు హిందూపురం పోలీస్ స్టేషన్ లో ఒక మహిళా కానిస్టేబుల్ పై దాడి చేశారని.. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో పోలీసులపై అధికారపార్టీ నాయకులు అనేక దాడులకు పాల్పడ్డారని తెలిపారు.

Also Read:  CBN : శ్రీపెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు

అధికారపార్టీకి కొమ్ముకాస్తూ వైసీపీ నాయకులను వెనకేసుకొచ్చే పోలీసు సంఘాలు పోలీసులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో పోలీసులకు ఇటువంటి పరిస్థితి దాపురించడానికి కారణం అధికార పార్టీ నాయకులను వెనకేసుకొస్తూ ప్రతిపక్షాలపై తప్పడు కేసులు నమోదు చేస్తున్న కొంతమంది పోలీసు అధికారులేన‌ని ఆయ‌న ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు వీటిపై స్పందించి ఇటువంటి దుర్మార్గాలను అరికట్టకపోతే రాష్ట్రంలో శాంతిభద్రతలకు పూర్తి విఘాతం కలుగుతుందన్నారు. పోలీసు అధికారులపై దాడులకు పాల్పడిన అధికారపార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల‌ని వ‌ర్ల రామ‌య్య డిమాండ్ చేశారు. పోలీస్ బాస్ గా పోలీసు శాఖ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన భాధ్యత డీజీపీపై ఉందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ అధికారపార్టీకి కొమ్ముకాస్తున్న నేరస్తులపై కఠిన‌ చర్యలు తీసుకోవాల‌ని డీజీపీని కోరారు.