మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్ట్ టీడీపీ శ్రేణులను కదిలించింది. ఏపీ వ్యాప్తంగా ఆయన అరెస్ట్ ను నిరసిస్తూ రోడ్ల మీదకు టీడీపీ క్యాడర్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులను పాల్పడుతోందని నినాదాలు చేస్తున్నారు. అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. స్వాతంత్ర్యం సమరంలో ఉద్యకారులతో జైళ్లు నిండిపోతే, ఇప్పుడు టీడీపీ లీడర్లతో ఏపీ జైళ్లు నిండుతున్నాయని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెంనాయుడు అన్నారు. ఏపీ సీఐడీ వ్యవహరిస్తోన్న తీరును నిరసించారు.
నర్సీపట్నంలోని ఇంట్లో ఉన్న అయ్యన్నపాత్రుడునుఆయన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ఇంటిగోడ కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటిని సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు రాజేశ్ను అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల అయ్యన్న ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన అంశంలో అయ్యన్న ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయింది. ఆ కేసు కు సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేసి ఏలూరు కోర్టులో హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై అయ్యన్న సతీమణి పద్మావతి మాట్లాడుతూ దుస్తులు మార్చుకునే అవకాశం కూడా పోలీసులు ఇవ్వకుండా భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఆవేదన చెందారు. చెప్పులు కూడా వేసుకునే సమయం ఇవ్వకుండా తోసుకుంటూ వెళ్లారని అన్నారు. మూడేళ్లుగా ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. మరోవైపు అయ్యన్న అరెస్టును టీడీపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఖండించారు. ఆయన అరెస్టును ఉత్తరాంధ్ర నేతలపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
ముఖ్యమంత్రి జగన్ ఒక రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న కుటుంబాన్ని తొలి నుంచి కూడా వేధిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర దోపిడీకి పాల్పడుతున్న వైసీపీని ప్రశ్నిస్తున్నందుకే అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతికి చంద్రబాబు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. అయ్యన్నకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అరెస్ట్ పర్వం ఇటీవల తగ్గింది. మళ్లీ జగన్ సర్కార్ మొదలు పెట్టింది. అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ధూళ్లిపాళ్ల నరేంద్ర తదిరతలను అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇటీవల కొంత నెమ్మదించిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ మళ్లీ అరెస్ట్ ల పర్వానికి తెరలేపింది. ఈ ఒరవడి ఇంకా కొనసాగుతుందా? అనేది చూడాలి.