ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీకి కీలకంగా మారిన గన్నవరం అసెంబ్లీపై అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లిన వల్లభనేని వంశీని ఎలాగైన ఈ సారి అసెంబ్లీకి రానివ్వకూడదని టీడీపీ కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వంశీని ఓడించేందుకు టీడీపీ పావులు కదుపుతుంది. వంశీపై పోటీ చేయించేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ని పంపించాలని భావించిన టీడీపీ అధిష్టానం ఆ ఆలోచనను విరమించుకుంది. వచ్చే ఎన్నికల్లో కేశినేని శివనాథ్ (చిన్ని)ని గన్నవరం నుంచి పోటీ చేయించాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి బచ్చుల అర్జునుడిని పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు.. అంతకుముందు కేశినేని చిన్నిని హైదరాబాద్ నివాసంకి పిలిపించుకుని గన్నవరంలో పోటీ చేసే విషయంపై చర్చించారు. సుధీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో అధినేత గన్నవరంకి వెళ్లాల్సిందేనని.. మరో సీటులో పోటీ చేసే ఛాన్స్ లేదని చెప్పినట్లు సమాచారం. అనంతరం హైదరాబాద్ నుంచి విజయవాడ రమేష్ ఆసుపత్రికి చంద్రబాబు కేశినేని చిన్నిన వెంటపెట్టుకుని వచ్చారు.
ప్రస్తుతం గన్నవరం ఇంఛార్జ్గా బచ్చుల అర్జునుడు ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో గతంలోనే కొత్త ఇంఛార్జ్ని నియమించాలని అధిష్టానం భావించింది.అయితే ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కేశినేని చిన్ని పేరును అధిష్టానం తెరమీదకు తెచ్చింది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎంపీ కేశినేని నాని ఉన్నప్పటికీ చిన్ని వెళ్లి కార్యక్రమాలు చేయడం.. అక్కడ వర్గాలుగా విడిపోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. దీనికి చెక్ పెట్టాలని భావించిన అధిష్టానం.. కేశినేని చిన్నిని గన్నవరం పంపితే అంతా సెట్ అవుతుందని అధినేత చంద్రబాబు భావించారు. ఈనేపథ్యంలోనే కేశినేని చిన్నిని హైదరాబాద్లోని తన నివాసానికి పిలిపించుకుని చంద్రబాబు గన్నవరం విషయం మాట్లాడినట్లు సమాచారం.