ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత చంద్రబాబునాయుడు(Chandrababu Arrest)అరెస్ట్ జరిగినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిర్బంధం – విడుదల, చంద్రబాబునాయుడిని పవన్ కల్యాణ్ కలవడం.. టీడీపీ నేతలతో కలిసి జనసేన పొత్తు ప్రకటించడం ఇలా అంతా.. క్షణాల్లో జరిగిపోయాయి. టీడీపీ – జనసేన పొత్తు ఖాయమవ్వడంతో.. చంద్రబాబు జైలులో ఉన్నా రాబోయే ఎన్నికల్లో గెలుపు ఖాయమని తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు గట్టిగా నమ్ముతున్నారు.
ఇక నేడు ఏసీబీ కోర్టులో.. సీఐడీ చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలంటూ వాడి-వేడిగా వాదనలు వినిపించింది. ఈ పిటిషన్ పై ఏసీబీ కోర్టు గురువారం (సెప్టెంబర్ 21) ఉదయం 11.30 నిమిషాలకు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పుపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ రాష్ట్రంలో టీడీపీ(TDP) నేతలు నిరసనలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వన్ టౌన్ లో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమం తప్పదని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ(Kakinada)లో నిర్వహిస్తున్న టీడీపీ దీక్షా శిబిరంలో టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి(Chikkala Satyavathi) మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆమెను జీజీహెచ్ కు తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా.. సత్యవతి కొన్నాళ్లుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీక్షా శిబిరం వద్ద మరణించిన మహిళా నేత సత్యవతికి స్థానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.