సమకాలీన రాజకీయాల్లో ఎప్పటికప్పుడు విధానాలను మార్చుకోవడం సర్వసాధారణం అయింది. అంతేకాదు, ప్రచారాన్ని కూడా ప్రజల మూడ్ ఆధారంగా మారిపోతోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏపీలోని విపక్ష పార్టీల వాలకం. ఇటీవల దాకా పప్పు బెల్లాల సంక్షేమానికి జగన్ మోహన్ రెడ్డి ఖర్చు చేస్తున్నారని ప్రచారం చేశాయి. దానికి మరింత ప్రాచుర్యాన్ని ఇస్తూ ఒక విభాగం మీడియా కూడా సంక్షేమ పథకాలతో ఏపీని శ్రీలంక కింద మార్చేశారని హెరెత్తించింది. సీన్ కట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కంటే అదనంగా లబ్ది చేకూర్చుతామని ఇప్పుడు చంద్రబాబు, పవన్ చెప్పడం గమనార్హం.
నవరత్నాలను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నమ్ముకున్నారు. ఎన్నికల హామీల్లోనూ అదే చెప్పారు. ఇప్పుడు అమలు చేస్తున్నారని వైసీపీ చెబుతోంది. ఇటీవల దాకా మరో శ్రీలంక మాదిరిగా ఏపీ తయారు అయిందని జగన్మోహన్ రెడ్డిని తప్పుబట్టారు. ఆ ప్రచారాన్ని వైసీపీ సానుకూలంగా మలుచుకుంది. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోతే, సంక్షేమ పథకాలు తీసివేస్తారని ప్రచారం వైసీపీ తీసుకెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తం అయిన టీడీపీ, జనసేన నష్ట నివారణ చర్యలకు పూనుకున్నాయి. ప్రస్తుతం అందిస్తోన్న సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగు పెట్టిస్తామని సరికొత్త అస్త్రాన్ని అందుకోవడం తాజా రాజకీయాల్లోని కీలక పరిణామం.
Also Read: Megastar Chiranjeevi: రాజకీయాలపై చిరంజీవి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు..!
మరో 16 నెలలు తరువాత ఎన్నికలకు ఉంటాయని ఉదాసీనంగా ఉండొద్దని జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందుకే, ఎమ్మెల్యేలు `గడప గడపకూ మన ప్రభుత్వం` కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లారు. ఆ సందర్భంగా 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు 18,000 ఫిర్యాదులను ఎమ్మెల్యేలు స్వీకరించారు. వాటిలో 15,000కు పైగా ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. గత ప్రభుత్వాలు ఎందుకు సంక్షేమ పథకాలను అయలు చేయడంలో విఫలమయ్యాయో విస్తృతంగా ప్రచారం చేశారు. మూడేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ ఏం సాధించగలిగిందో తెలియచేస్తూ విపక్షాలను టార్గెట్ చేశారు. సుమారు 1.7 లక్షల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా బదిలీ చేయడం వల్ల పార్టీ ప్రజాభిమానం పొందేందుకు దోహదపడిందని వైసీపీ విశ్వసిస్తోంది.
టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పులపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే తరహాలో జనసేనాని కూడా జగన్ సర్కార్ మీద ఇటీవల పలు సందర్భాల్లో ఆగ్రహించారు. సంక్షేమ పథకాలు ప్రజలను సోమరులను చేస్తున్నాయని పవన్ గతంలో విమర్శించారు. అదే పవన్ తాజాగా సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని స్వరం మార్చారు. మొత్తం మీద ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు అదనంగా ఇస్తామని చంద్రబాబు, పవన్ తాజాగా హామీలు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది.
Also Read: CM Jagan: నేడు నర్సాపురంలో సీఎం జగన్ పర్యటన.. ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన