TDP Janasena: బీజేపీలేని కూటమి దిశగా టీడీపీ, జనసేన

కర్ణాటక ఫలితాలతో మోడీ -ద్వయం మీద ప్రజలకు ఉన్న కోపం బయట పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నారని బోధపడింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తో దూరంగా ఉండటం మేలని టీడీపీ , జనసేన భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Published By: HashtagU Telugu Desk
AP Trend

Pawan With Tdp Chief N Chandrababu Naidu Ht 1673894884446

TDP Janasena: కర్ణాటక ఫలితాలతో మోడీ -ద్వయం మీద ప్రజలకు ఉన్న కోపం బయట పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నారని బోధపడింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తో దూరంగా ఉండటం మేలని టీడీపీ , జనసేన భావిస్తున్నట్టు తెలుస్తుంది. పైగా రాబోవు రోజుల్లో కేంద్రంలో యూపీఏ, ఎన్డీయే మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంచనాకు వస్తున్నారు. అలాంటి పరిస్థితి వస్తే ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న యుపిఎ కి మద్దతు ఇవ్వాలి. అప్పుడు ఏపీ కల నెరవేరుతుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సీఎం పదవిని కూడా ఆశించనంటూ ప్రకటించిన పవన్ బీజేపీ కి దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నారని టాక్. అదే జరిగితే బీజేపీ కి ఏపీలో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాగే తెలంగాణలో అధికారం కలగా మిగలనుంది.

కర్ణాటక ఫలితాల తరువాత ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు పైన వ్యతిరేకంగా ఉన్న బీజేపీ నేతలు ఒక్క సారిగా మొత్తబడినట్లు కనిపిస్తోంది. పొత్తు నిర్ణయం పార్టీ నాయకత్వం పరిశీలిస్తుందనే సానుకూల సంకేతాలు ఇస్తున్నారు. ఇదే సమయంలో పవన్ వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలుస్తాయని గట్టిగా చెబుతున్నారు.కర్టాటక ఫలితాల తరువాత పొత్తులు బీజేపీకి అవసరమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో బీజేపీతో పొత్తులు అవసరమా అనే చర్చ టీడీపీ, జనసేన లో కూడా మొదలైంది. ఆ క్రమంలో ఏపీలో పొత్తుల వ్యవహారం పైన మరో వారం రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

వైసీపీ విముక్త ఏపీ లక్ష్యంగా జనసేన వ్యూహాలు ఉంటాయని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న దాష్టికాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తామని చెప్పారు. ఏపీకి మేలు జరిగే విధంగా పొత్తులు ఉంటాయని చెప్పుకొచ్చారు. బీజేపీ ముఖ్య నాయకులు, చంద్రబాబుతో పొత్తులపై చర్చలు జరిపామని మనోహర్ వెల్లడించారు. రెండు పార్టీలు కలిసి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే తమ విధానమని వివరించారు. పవన్ కల్యాణ్ చెప్పిన విధంగా పొత్తులు ఉంటాయన్నారు. పొత్తులకు ఎవరైనా కలిసి రాకపోతే రాష్ట్ర భవిష్యత్ కు జరుగుతున్న నష్టాన్ని వివరించి ఒప్పిస్తామని చెప్పుకొచ్చారు.
పొత్తుల అంశం పైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఎవరు ఎవరితో కలిసినా తమకు ఇబ్బంది లేదన్నారు. అసలు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తారో లేదో చూడాలన్నారు. తాము 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధిస్తే.. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు. పొత్తులు చూసి భయపడే అవసరం తమకు లేదన్నారు. టీడీపీ లాగా మరో పార్టీ చేయి పట్టుకొని పోరాటం చేయాల్సిన అవసరం తమకు ఉండదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు.

పొత్తుల దిశగా టీడీపీ, జనసేన ఆలోచిస్తుంటే, వైసీపీ మాత్రం సింగిల్ గా బరిలోకి దిగనుంది. అయితే , బీజేపీ ని కలుపుకుంటే నష్టపోతామన్న భావన టీడీపీ, జనసేనలో మొదలైంది.

  Last Updated: 14 May 2023, 10:28 PM IST