టీడీపీ చీఫ్ చంద్రబాబానాయుడు 40ఏళ్లకు పైగా అనుభవం ఉన్న రాజకీయవేత్త. దేశ వ్యాప్తంగా పలు వ్యవస్థల్లో ఆయనకున్న పరిచయాలు బలమైనవి. అందుకే, ముందస్తుగా సమాచారం ఆయనకు వస్తుంటుంది. తాజాగా చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి. బహుశా తెలంగాణతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉందని ఆయన విశ్వసిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో `బాదుడేబాదుడు` కార్యక్రమానికి చంద్రబాబు సిద్ధం అవుతూ ఆ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 4వ తేదీన జరిగే కార్యక్రమంపై నేతలతో చర్చించారు. ఆ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని సంకేతాలు ఇచ్చారు. వచ్చే మే నెల లేదా డిసెంబరులో ఎన్నికలు ఉంటాయని చెప్పారట. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నేతలంతా ప్రజల్లోనే ఉండాలని దిశానిర్దేశం చేశారు.
గతంలోనూ పలుమార్లు చంద్రబాబు ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించారు. తొలుత చంద్రబాబు మాటలను వైసీపీ ఖండించింది. ఆ తరువాత ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి ఏడాదికో , రెండేళ్లకో ఎన్నికలంటూ మాట జారారు. దీంతో చంద్రబాబు నాయుడు చెప్పిన `ముందస్తు` ఖాయమనే సంకేతాలు వెళ్లాయి. అందుకే బలం చేకూరేలా వైసీపీ ప్లీనరీలోని తీర్మానాలు ఉన్నాయి. మంత్రులను ప్రజల వద్దకు పంపడం నుంచి ఎమ్మెల్యేలను గడపగడపకు పంపడం వరకు జగన్ ముందస్తుకు సిద్ధం అవుతున్నారన్న సంకేతాలకు అనుగుణంగా ఉన్నాయి.
తాజాగా చంద్రబాబు వచ్చే డిసెంబర్ లోపు ఎన్నికలు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. అంటే, వచ్చే డిసెంబర్ కు తెలంగాణ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఆ లోపు ఎన్నికలను తెలంగాణలో నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళితే బాగుటుందని భావిస్తుందట. ఆ విషయం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. దానికి కారణం లేకపోలేదు. సెటిలర్ల ఓటు బ్యాంకు కేసీఆర్ , జగన్ గెలుపోటములను నిర్ణయిస్తుంది. వాళ్లను ఎలా ఉపయోగించుకోవాలి? అనేదానిపై వచ్చే ఎన్నికలకు ఉంటాయని కొందరు భావిస్తున్నారు.
తెలంగాణ, ఏపీ సీఎంల మధ్య అవగాహన బాగా ఉంది. ఇద్దరూ కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. పైగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఏపీలోకి ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ క్రమంలో పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సహకారం అందుతుంది. అదే సమయంలో తెలంగాణలో జగన్ ప్రాబల్యం కేసీఆర్ కు ఉపయోగపడుతుంది. ఇలా పలు కోణాల నుంచి ఆలోచించిన తరువాత ఒకేసారి ఎన్నికలు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు తాజాగా `ముందస్తు` ఎన్నికల నెలలను కూడా టీడీపీ నేతలకు చెప్పడం చర్చనీయాంశం అయింది.