Site icon HashtagU Telugu

Tadepalligudem: జగన్‌ హెలికాప్టర్‌లతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు: జనసేన

Tadepalligudem

Tadepalligudem

Tadepalligudem: సీఎం వైఎస్ జగన్ భద్రతా కారణాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు అద్దెకు తీసుకుంది. ప్రజాధనంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో జనసేన జగన్ పై ఫైర్ అయింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.25 కోట్లు వెచ్చించి రెండు హెలికాప్టర్లను లీజుకు తీసుకోవడం అత్యంత బాధ్యతారాహిత్యమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ తీరుని ఎండగట్టారు. ఎన్నికల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.

ప్రధానమంత్రి మినహా ప్రభుత్వ వాహనాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదన్న నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని మనోహర్ అన్నారు. ప్రజా ధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారో, శాంతి భద్రతలకు ఎలాంటి బెదిరింపులు ఎదురవుతున్నాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారానికి, పార్టీ కార్యక్రమాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేసే అర్హత ముఖ్యమంత్రికి లేదు. “అవసరమైతే ముఖ్యమంత్రి తన జేబులోంచి ఖర్చు పెట్టాలి,” అని ఆయన అన్నారు. రాబోయే ప్రభుత్వం ఇలాంటి అవకతవకలపై విచారణ జరుపుతుందని మనోహర్ అన్నారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై తమ వైఖరిని ప్రజలకు వివరించేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని అన్నారు. ఫిబ్రవరి 28న టీడీపీ, జనసేన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. తాడేపల్లిగూడేంలో నిర్వహించే ఈ మహా బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుండి తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆయన తెలిపారు

తమది పారదర్శక ప్రభుత్వమని టీడీపీ. జనసేన ప్రజలకు తెలియజేస్తుందని మనోహర్ అన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు బహిరంగ సభకు హాజరుకావాలని మనోహర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ వేదికలో ఒక్కో పార్టీకి చెందిన 250 మంది నాయకులు ఉంటారు. కాగా ఈ మీడియా సమావేశంలో జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌, పీఏసీ సభ్యులు కనకరాజు సూటి, చేగొండి సూర్యప్రకాష్‌, పితాని బాలకృష్ణ, ఆర్గనైజింగ్‌ కన్వీనర్‌ కళ్యాణం శివశ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Tollywood: గెస్ట్ రోల్ కోసం భారీగా పారితోషికం డిమాండ్ చేసిన బాలీవుడ్ హీరో.. 8 నిమిషాల సీన్ కు ఏకంగా అన్ని కోట్లా?