Site icon HashtagU Telugu

Ex AP CID Chief Sanjay: ఏపీ సీఐడీ మాజీ డీజీ సంజయ్ పై సస్పెన్షన్ వేటు…

Ex Ap Cid Chief Sanjay

Ex Ap Cid Chief Sanjay

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సర్వీసు నిబంధనల ఉల్లంఘన కారణంగా సంజయ్‌పై ఈ చర్య తీసుకోబడ్డింది. ఆయనపై నిధుల దుర్వినియోగం, అధికార ప్రదర్శనలో అక్రమాలు జరిపాడని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంజయ్‌ పదవిలో ఉండగా టెండర్లు లేకుండా ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌లు కొనుగోలు చేసినట్టు, అలాగే అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటి ఆధారంగా సంజయ్‌పై చర్యలు చేపట్టిన ప్రభుత్వం, విచారణ పూర్తి అయ్యేవరకు ఆయన విజయవాడ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసింది.

అఖిలభారత సర్వీసుల నియమావళి 3(1) సెక్షన్ ప్రకారం సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై సస్పెన్షన్ ఆదేశాలు జారీచేసింది. అనుమతి లేకుండా ఆయన విజయవాడ వదిలి వెళ్లకూడదని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

సంజయ్ సీఐడీ అదనపు డీజీగా, ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేశారు. విధుల్లో ఉండగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అఖిలభారత సర్వీసుల క్రమశిక్షణ, రూల్ 1969లోని నిబంధన 3(1) కింద సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసింది.

అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేస్తున్న సమయంలో టెండర్ ప్రక్రియలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. అగ్ని పోర్ట్లలో ఎన్వోసీలను జారీ చేయడంలో, రూ.2.29 కోట్ల విలువైన హార్డ్‌వేర్ సరఫరా ఒప్పందాన్ని ‘సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్’ కు అప్పగించడం వంటి చర్యలు తీసుకున్నారని తెలిపింది. 2023 ఫిబ్రవరి 23న జరిగిన ఒప్పందం ప్రకారం రూ.59.93 లక్షలు చెల్లించబడ్డాయి. అయితే, 2023 ఏప్రిల్ నాటికి కేవలం 14% మాత్రమే ప్రాజెక్టు పూర్తి అయినట్లు విచారణలో తేలింది.

అలాగే, మైక్రోసాఫ్ట్ లాప్‌టాప్‌లు, యాపిల్ ఐప్యాడ్లు టెండర్ ప్రక్రియ లేకుండా డీజీ హోదాలో సంజయ్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఈ కొనుగోళ్లలో రూ.17.89 లక్షలు అధిక చెల్లింపులు జరిగాయని విజిలెన్స్ నివేదిక వెల్లడించింది.

సదస్సుల పేరుతో అధిక బిల్లులు:

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అవగాహన సదస్సుల నిర్వహణ పేరుతో భారీ బిల్లులు సమర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ సదస్సులు నిర్వహించినట్లు చూపించి, వాటి ద్వారా కోట్లలో బిల్లులు తీసుకున్నారు. ఈ కార్యక్రమాలు కృతి వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడ్డాయి.

సదస్సుల నిర్వహణకు వ్యయంగా రూ. 3.10 లక్షలు ఖర్చు చేసినప్పటికీ, కోటి 15 లక్షల అదనపు బిల్లులు చెల్లించడం జరిగింది. ఆర్థిక పారదర్శకత లేకుండా, అడ్రస్‌ లేని సంస్థకు టెండర్లను కట్టబెట్టారు. ఈ అనుమానాస్పద వ్యవహారం గురించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

అధికార దుర్వినియోగం, ప్రజాధనాన్ని అర్థం చేసుకోకుండా ఖర్చు చేయడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాక, ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ వదిలి వెళ్లకూడదని సంజయ్‌కు ఆదేశాలు జారీ చేశారు.