తెలుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ పప్పు కాదు ఫైర్ అని నిరూపించుకోవడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల ఆయన పాదయాత్ర చేస్తారు. అంటే సరాసరి రోజుకు 10 కిలోమీటర్ల యాత్రను డిజైన్ చేస్తున్నారు. ఆ విషయాన్ని స్వయంగా లోకేశ్ అధికారికంగా ప్రకటించడం టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతోంది.
వచ్చే ఏడాది జనవరి 27 తేదీన పాదయాత్రకు లోకేశ్ శ్రీకారం చుడతారు. ఆ విషయాన్ని మంగళగిరి నియోజకవర్గంలోని నూతక్కి గ్రామంలో జరిగిన `బాదుడే బాదుడు` కార్యక్రమం సందర్భంగా ఆయన క్లారిటీ ఇచ్చారు. నాలుగు రోజుల పాటు మంగళగిరి నియోజవర్గంలో యాత్ర ఉంటుందని ప్రకటించారు. పాదయాత్ర నేపథ్యంలో ఏడాది పాటు నియోజకవర్గానికి దూరంగా ఉంటానని స్థానిక లీడర్లకు వివరించారు. రాష్ట్రంలో టీడీపీని గెలిపించే బాధ్యతలను తాను భుజాన వేసుకోబోతున్నానని, మంగళగిరి గెలుపు బాధ్యతలను మీరు తీసుకోవాలని స్థానిక లీడర్లకు దిశానిర్దేశం చేశారు.
పాదయాత్ర రూట్ మ్యాప్ ను రాజకీయ వ్యూహకర్త రాబిన్ సింగ్ రూపొందిస్తున్నారు. తిరుపతి నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర బ్లూ ప్రింట్ సిద్ధం అవుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ నాలుగు రోజులకు తగ్గకుండా డిజైన్ చేస్తున్నారు. బలమైన నియోజకవర్గాల కంటే బలహీనంగా ఉన్న వాటిలోనే ఎక్కువ రోజులు పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఏం మాట్లాడాలి? ఎక్కడ ఆగాలి? ఎవర్ని కలవాలి? టైమ్ టూ టైమ్ షెడ్యూల్ ను ఐ ప్యాక్ టీమ్ రూపొందిస్తోంది. ఆయన పాదయాత్ర ప్రారంభం అయ్యే నాటికి 175 స్థానాల్లో టిక్కెట్లను ఫైనల్ చేయాలని రాబిన్ సింగ్ ఇచ్చిన సలహాను అమలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నం మొదలు పెట్టారు. ఆ క్రమంలో ఇప్పటికే 90 స్థానాల్లోని అభ్యర్థులకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగిలిన వాటిల్లోనూ అభ్యర్థులను ఫైనల్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నారా లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేసే బాధ్యతలను కూడా వాళ్లకే అప్పగించేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. భవిష్యత్ టీడీపీ సారథిగా నిరూపించుకోవడానికి లోకేశ్ కు పాదయాత్ర కలిసొచ్చిన అంశంగా ఆయన అభిమానులు భావించడం గమనార్హం.