వొంటిమిట్ట ఆలయంలో నేడు సీతారాముల కళ్యాణం జరగనుంది. శ్రీరామనవమి(Sri Rama Navami )బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీసీతా రామ కల్యాణం సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. సీతారాముల కళ్యాణం చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంటిమిట్ల పర్యటన రద్దయింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సీఎంవో నుంచి జిల్లా కలెక్టర్ విజయరామరాజుకు సమాచారం అందింది. వొంటిమిట్టకు అధిక సంఖ్యలో యాత్రికుల వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని APSRTC బుధవారం, గురువారం నుండి ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా అంతటా 118 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
కడప నుంచి 45, పులివెందుల నుంచి 10, జమ్మలమడుగు నుంచి 10, ప్రొద్దుటూరు నుంచి 20, బద్వేల్ నుంచి 20, ఇతర డిపోల నుంచి 45 సర్వీసులు నడపనున్నారు. కడప, రాజంపేట మార్గాల్లో కల్యాణ వేదికకు దాదాపు కిలోమీటరు దూరంలో వాహనాలకు రెండు పార్కింగ్ స్థలాలను కేటాయించాలని ప్రతిపాదించారు. కళ్యాణ వేదిక వరకు భక్తులను తరలించేందుకు కడప నుంచి 4, రాజంపేట పార్కింగ్ స్థలాల నుంచి 6 చొప్పున మొత్తం 10 ఉచిత సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ జిల్లా మేనేజర్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతి నుంచి రాజంపేట మీదుగా వచ్చే గూడ్స్ వాహనాలను తిరుపతి, రేణిగుంట, పీలేరు, రాయచోటి కడప వైపు మళ్లిస్తున్నట్లు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. కడప వైపు వెళ్లే కార్లు, ఆటోరిక్షాలు, ఇతర వాహనాలను రాయచోటి వైపు మళ్లిస్తామని తెలిపారు. వొంటిమిట్ట, రాజంపేట వైపు వెళ్లే వాహనాలను నందలూరు, కుక్కల దొడ్డి, అనంతరాజు పేట్, ఓబులవారి పల్లె, పుల్లంపేట, మంగంపేట వరకు ఏప్రిల్ 6 ఉదయం వరకు నిలుపుదల చేయాలని ఎస్పీ తెలిపారు.