చంద్రబాబు అరెస్టుకు(Chandrababu Arrest) నిరసనగా పలువురు నాయకులు రోజూ మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. నేడు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మోత్కుపల్లి నరసింహులు దీక్ష(Protest) చేశారు. ఈ దీక్షకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy Chandramohan Reddy) కూడా వచ్చి సంఘీభావం ప్రకటించారు.
ఈ దీక్షలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపిలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను అరాచక ఆంధ్రప్రదేశ్ గా జగన్ మార్చాడు. అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబును రానున్న ఎన్నికల్లో ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపారు. లోకేష్ ను కూడా జైలుకు పంపాలని కుట్ర చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో అవకతవకలు జరగలేదు. అన్ని ఆధారాలు ఉన్నాయి. పులివెందుల స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం నుంచి మొదలు పెడదాం. అన్ని కంప్యూటర్లు, పరికరాలు ఉన్నాయో లేదా పరిశీలిద్దాం రండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చంపేశారు. రింగ్ రోడ్ కేసును కూడా మోపాలని చూస్తున్నారు అని జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.