Election violence in AP: ఏపిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు.. ఆ తర్వాత జరిగిన హింస(violence)పై సిట్(Sit) తన ప్రాథమిక నివేదిక(Preliminary report)ను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం నిన్న అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గుర్తించారు. ఈ దమనకాండపై రెండు రోజులపాటు విచారణ జరిన సిట్.. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించి విచారణ జరిపింది.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్ ఇచ్చిన 150 పేజీల నివేదికలో పలు కీలకాంశాలను పొందుపరిచింది. ఈ ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లతో పాటు స్థానికులు, పోలీసులను విచారించి.. మూడు జిల్లాల్లో దాదాపు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు తేల్చింది. ఎఫ్ఐఆర్లో కొత్త సెక్షన్లు చేర్చే అంశంపైనా సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలా? వద్దా అనే అంశంపైనా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హింస జరుగుతుందని తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా సిట్ నిర్థరించింది. స్థానిక నేతలతో కుమ్మక్కైన పోలీసులు హింస జరుగుతున్నా.. మిన్నకుండిపోయారని ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Read Also: Ebrahim Raisi Death: అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో ఇరాన్ లో సంబరాలు
ఈ వ్యవహారంలో కొందరు పోలీస్ అధికారులపైనా కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. ఈ ఘటనల్లో ఉపయోగించిన రాళ్లు, కర్రలు, రాడ్లు వంటి సామగ్రికి సంబంధించిన ఆధారాలూ సేకరించిన సిట్.. ఈ ఘటనలతో సంబంధం ఉన్న పలువురు రాజకీయ నేతల్ని సైతం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపైనా కొన్ని సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను డీజీపీ.. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ప్రభుత్వం ద్వారా అందించనున్నారు. ఈ ఘటనలపై పూర్తి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని సిట్ కోరే అవకాశం ఉంది.
Read Also: 18 Dead: ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
మరోవైపు హింసాత్మక ఘటనల బాధ్యులు కావడంతో సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగులు వచ్చాయి. నరసరరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్సీగా కే.రవి మనోహర్ చారి, తాడిపత్రి డీఎస్పీగా కే జనార్దన్ నాయుడు, తిరుపతి ఎస్బీగా ఎం వెంకట్రాది, పల్నాడు స్పెషల్ బ్రాంచ్ సీఐలుగా బీ.సురేష్ బాబు, యూ.శోభన్ బాబులు, కారంపూడి ఎస్ఐగా కే.అమీర్, నాగార్జున సాగర్ ఎస్ఐగా ఎం పట్టాభి, తిరుపతి ఎస్బీ ఇన్స్పెక్టర్గా ఏ విశ్వనాథ్, అలిపిరి సీఐగా ఎం రామారావు, తాడ్రిపత్రి సీఐగా పీ.నాగేంద్ర ప్రసాద్లు నియామకం అయ్యారు. ఈ అధికారులు అందరినీ తక్షణమే విధుల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ డీజీపీకి ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు అధికారుల పేనల్లో ఒకరిని ఎంపిక చేసి ఎన్నికల సంఘం పోస్టింగులు ఇచ్చింది.