Roja: మాజీ మంత్రి రోజాకు షాక్ ..వైసీపీ హయాంలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలపై విజిలెన్స్ విచారణ పూర్తి

ఈ విచారణ నివేదికను విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం తుది దశకు తీసుకువచ్చారు. వచ్చే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర డీజీపీకి నివేదికను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.

Published By: HashtagU Telugu Desk
Shock for former minister Roja... Vigilance investigation into 'Aadudam Andhra' competitions held during YCP regime complete

Shock for former minister Roja... Vigilance investigation into 'Aadudam Andhra' competitions held during YCP regime complete

Roja:  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ప్రచారం కలిగించిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీల నిర్వహణపై విజిలెన్స్ శాఖ చేపట్టిన విచారణ ముగిసింది. సుమారు రూ.119 కోట్లు ఖర్చు చేసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆధారాలు లభించాయని సమాచారం. ఈ విచారణ నివేదికను విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం తుది దశకు తీసుకువచ్చారు. వచ్చే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర డీజీపీకి నివేదికను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.

నిధుల దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రారంభించినప్పటికీ, నిర్వాహనంలో పారదర్శకత లేకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. ప్రత్యేకంగా క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట లక్షలాది రూపాయలు అక్రమంగా వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒకేసారి భారీగా టెండర్లను మంజూరు చేయడం, తక్కువ నాణ్యత కలిగిన క్రీడా సామగ్రిని అధిక ధరలకు కొనుగోలు చేయడం, కాంట్రాక్ట్ లెందర్ల ఎంపికలో గందరగోళం వంటి అంశాలు విపక్షాల ఆరోపణలకు కారణమయ్యాయి.

మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఆరోపణలు

ఈ వ్యవహారంలో అప్పటి క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా పాత్ర కూడా ఉంది అని టీడీపీ నేతలు ఆరోపించారు. మంత్రిగా ఆమె హస్తక్షేపంతోనే కొన్ని టెండర్లు అప్పగించబడ్డాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ శాఖను రంగంలోకి దిగి విచారణ చేయాలని ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు గత కొన్ని నెలలుగా అభ్యంతరకర లావాదేవీలపై విచారణ చేపట్టి, సంబంధిత పత్రాలు, చెల్లింపుల రికార్డులు, టెండర్ ప్రక్రియ వివరాలు, ఖర్చుల సరాసరి వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు, అధికారులతో పాటు మాజీ మంత్రిపై కూడా విచారణ కొనసాగించినట్లు తెలుస్తోంది.

నివేదికలో కీలక అంశాలు

విజిలెన్స్ నివేదికలో కాంట్రాక్టర్ల ఎంపిక పద్ధతులు, బిల్లుల అనుమతుల విధానం, కొనుగోళ్ల వివరాలు, మరియు ఖర్చుల సరైన రికార్డు లేనివి వంటి అంశాలు ప్రస్తావించబడ్డాయని చెబుతున్నారు. అంతేకాకుండా వాస్తవ ఖర్చు కంటే మూడు, నాలుగు రెట్లు అధికంగా బిల్లులు వేయబడ్డాయన్న అనుమానాలు కూడా నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

తదుపరి చర్యలపై ఉత్కంఠ

ఈ నివేదిక ప్రభుత్వానికి చేరిన తర్వాత, తదుపరి చర్యలు ఎలాంటి ఉంటాయన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటనపై ప్రస్తుత ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందన్నది గమనించాల్సిన విషయం. అవినీతికి పాల్పడిన వారిపై ఆర్థిక నష్టపరిహారం, శిక్షార్హ చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో సానుకూల భావాన్ని తీసుకొచ్చేలా నిర్వహించాల్సిన క్రీడా కార్యక్రమం, ఇప్పుడు అవినీతి ఆరోపణలతో హీట్‌ ఆఫ్‌ డిబేట్‌గా మారింది. విజిలెన్స్ నివేదికలో వెల్లడయ్యే వివరాలు, ప్రభుత్వ స్పందన వచ్చే కొన్ని రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

Read Also: Congress : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు గెలుపు కోసం పక్కా వ్యూహంతో కాంగ్రెస్..హోంమంత్రి పదవి ‘ఆఫర్’

  Last Updated: 10 Aug 2025, 11:42 AM IST