Section 30 Of Police Act: ఏపీలోని తిరుపతి జిల్లాలో పోలీసులు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ (Section 30 Of Police Act) అమలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 25-09-2024వ తేదీ నుండి 24-10-2024వ తేదీ వరకు ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల అంటే అక్టోబర్ 24వ తేదీ వరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఏదైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేయాలంటే ముందస్తుగా లిఖితపూర్వకంగా పోలీసు వారికి అర్జి ఇచ్చి, వారి నుండి అనుమతి తీసుకోవాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు మొదలగునవి నిర్వహించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, జైలు శిక్ష కూడా అనుభవించాల్సి రావచ్చని తెలిపారు. వివిధ పార్టీ నాయకులు, సంస్థలు, వివిధ సమూహాలు, ప్రజలు పోలీస్ వారి ఉత్తర్వులను పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ చేయడానికి పోలీస్ వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఈ సందర్భంగా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అంటే ఏమిటి..?
1861 పోలీస్ యాక్ట్లోని సెక్షన్ 30 ప్రకారం ఏదైనా ప్రాంతంలో లేదా నగరంలో పోలీసులు ఆంక్షలను విధించే అధికారం ఉంది. ఈ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు ఇచ్చే అధికారం పోలీసులకు ఉంటుంది. అయితే సభలు, సమావేశాలు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావించిన సందర్భాల్లోనే ఈ సెక్షన్ 30ని ఉపయోగించగలరు. ఈ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించే వారిపై మెట్రోపాలిటన్ సిటీ పోలీస్ యాక్ట్ లోని 2016 ఐపీసీ 188, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.