Sarva Darshan Tokens : టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది. తిరుపతిలో అక్టోబర్ 6, 7, 8, 13, 14, 15 తేదీలలో ఆరు రోజుల పాటు శ్రీవారి సర్వ దర్శనం (ఎస్ఎస్డీ) టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. పెరటాసి శనివారాల కారణంగా తిరుమలలో కొనసాగుతున్న రద్దీ దృష్ట్యా ఆయా తేదీల్లో సర్వ దర్శనం టోకెన్ల జారీని ఆపేశామని తెలిపింది.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అక్టోబరు 15 నుంచి 23 వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం ఉండదు. అక్టోబరు 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది.
తిరుపతిలోని కపిలేశ్వరాలయంలో కామాక్షి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 15 నుంచి 23 వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీకామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో అక్టోబరు 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. అక్టోబరు 15న కలశ స్థాపన, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 16న శ్రీ కామాక్షి దేవి, 17న శ్రీ ఆదిపరాశక్తి, 18న మహాలక్ష్మి, 19న శ్రీ అన్నపూర్ణాదేవి, 20న దుర్గాదేవి, 21న శ్రీ మహిషాసురమర్థిని, 22న శ్రీ సరస్వతిదేవి, 23న విజయదశమి సందర్భంగా శ్రీ శివపార్వతుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.