భారతదేశం గర్వించదగ్గ అంబేద్కర్ స్మారకార్ధం స్మృతివనం పనులు 20ఎకరాలలో శరవేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. బుధవారం అంబేద్కర్ స్మృతివనం (Ambedkar Smritivanam) పనులను ఆయన పరిశీలించారు. దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అసమానతల నుంచి పుట్టి వాటిపైనే పోరాటం చేసిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం చాలా పటిష్టమైనదని, అన్ని వర్గాలకు అంబేద్కర్ ఆదర్శం అన్నారు. అంబేద్కర్ పేరు చరిత్రలో నిలిచిపోయేలా ప్రతిపాదించడమే కాదు, పనులు ప్రారంభించిన ఘనత సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మారుమూల ప్రాంతంలో చంద్రబాబు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకి స్థలం పేరుకే కేటాయించారని అన్నారు. అంబేద్కర్ని కీర్తించడానికి ఇంతకంటే మంచి ప్రాంతం ఎక్కడ ఉండదని అన్నారు.
వైఎస్సార్ సీపీ, సీఎం వైఎస్ జగన్ హృదయంలో అంబేద్కర్ స్థానమేంటో చెప్పడానికి ఈ స్మృతివనం ఉదాహరణ అని అన్నారు. దేశమంతా గర్వించేలా ఈ స్మృతివనం పనులు జరుగుతున్నాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం చాలా గర్వకారణం అన్నారు. 2016లో చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఎటువంటి పనులు చేయకుండా దిగిపోయారని, అంబేద్కర్ పై సీఎం వైఎస్ జగన్ కి ఉన్న గౌరవానికి నిదర్సనమే ఈ స్మృతివనం అని అన్నారు.
మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. నగరం నడి మధ్యలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చరిత్ర పుటల్లో లిఖించే రోజు అని అన్నారు. 20 ఎకరాలలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చాలా గర్వకారణం అని అన్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకి 200 కోట్లు అవుతాయనుకున్నామని, ఇప్పుడు 400 కోట్లకి ఖర్చు పెరిగిందని అన్నారు. ఇంకా ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. చాలా వేగంగా పనులు జరుగుతున్నాయని, కరోనా సమయంలో పనులు ప్రారంభించామని, త్వరలోనే అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు.
Past Life: ప్రతి ఒక్కరు పూర్వజన్మను మరిచిపోవడానికి గల కారణం ఇదే?