కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ తరహాలోనే ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పొందాడు. ఇద్దరూ ఫిట్ నెస్ కు బాగా ప్రాధాన్యం ఇచ్చే వాళ్లే. పైగా వాళ్లిద్దరిదీ ఇంచుమించు ఒకే వయసు. గుండెపోటు రాగానే సోమవారం వేకువజామున గౌతమ్ రెడ్డిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పది నిమిషాల్లోనే చికిత్సను అందించే ప్రయత్నం చేశారని తెలిసింది. స్ట్రోక్ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణం పోయినట్టు వైద్యులు చెబుతున్నారు.మంత్రి గౌతమ్ రెడ్డి తొలి నుంచి ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇస్తుంటారు. ప్రతి రోజూ వ్యాయామం చేసే అలవాటు ఉంది. కొన్నేళ్లుగా జిమ్ చేస్తుంటారని ఆయన అనుచరులు చెబుతుంటారు. పైగా ఆయన ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. దైనందిన జీవితం కూడా క్రమశిక్షణతో ఉంటుంది. ఆ విషయాన్ని సమీప బంధువులు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజూ ఆయన నడవడిక ఉంటుందని అధికారులు అంటున్నారు. టైం టూ టైం డైట్ ను కూడా అవలంభిస్తుంటారు. డైట్ డాక్టర్ ఇచ్చే సూచనల మేరకు ఆహార నియమాలు ఉంటాయని ఆయనతో వ్యక్తిగత పరిచయం ఉన్న వాళ్లు చెబుతున్నారు.మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నుంచి ఆయనకు రాజకీయ వారసత్వం వచ్చింది. వరుసగా రెండుసార్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. విద్యాధికుడిగా ఉన్న గౌతమ్ రెడ్డి ప్రతిభను గుర్తించిన సీఎం జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించాడు. తొలి రోజు నుంచి యువతకు ఉద్యోగ కల్పన కోసం గౌతమ్ రెడ్డి వినూత్న మార్గాలను అన్వేషించాడు. పరిశ్రమలను నెలకొల్పడానికి పలు కంపెనీలతో ఒప్పందాలు ఇటీవల చేసుకున్నాడు. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలను ఏపీకి తీసుకురావడానికి ఇటీవల దుబాయ్ వెళ్లాడు. కొన్ని రోజులు అక్కడే ఉన్న ఆయన పలు కంపెనీల సీఈవోలు, ఉన్నత స్థానంలో ఉన్న వాళ్లను కలిశాడు. పరిశ్రమలు పెట్టడానికి ఏపీలో ఉన్న అవకాశాలను ప్రపంచ వ్యాప్తం చేయడానికి ప్రయత్నం చేశాడు.
క్రమశిక్షణతో కూడిన గౌతమ్ రెడ్డి జీవనం, ప్రజలతో మమేకం అయ్యే తీరు సామాన్యులను ఆకర్షించింది. అందుకే, ఆయన ఎక్కడున్నా జనం కిక్కిరిసి పోతుంటారు. నిజయోజకవర్గంలో ఉంటే జనం ఎక్కువగా ఆయన్ను కలవడానికి వచ్చే వాళ్లు. నమ్ముకున్న వాళ్లకు చాలా చేయాల్సిన ఉందనే భావన ఆయనలో ఉండేదట. వ్యక్తిగత జీవితంలోనూ పెద్దగా ఒత్తిడి ఆయనకు లేదని కుటుంబీకులు ద్వారా తెలుస్తోంది. ఇటీవల పరిశ్రమలు, ఐటీ రంగాన్ని ఏపీకి తీసురావడంపై ఎక్కువగా అధ్యయనం చేశారు. అంతకు మినహా ఆయనకు ఎలాంటి మానసిక ఒత్తిడి కూడా లేదు. అయినప్పటికీ గుండెపోటు హఠాత్తుగా రావడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది.మేకపాటి గౌతమ్ రెడ్డి మాదిరిగానే కన్నడ కంఠీరవ హీరో పునీత్ కూడా వ్యాయామానికి ప్రాధాన్యం ఇచ్చే అలవాటు ఉండేది. జిమ్ కు ప్రతి రోజూ వెళ్లి ఫిట్ నెస్ కోసం ఆయన ప్రయత్నం చేస్తుంటారు. వ్యక్తిగత జీవితం, ఆహారపు అలవాట్లు కూడా చాలా క్రమశిక్షణతో కూడి ఉంటాయి. ఉషోదయపు వేళ జిమ్ చేస్తోన్న సమయంలో పునీత్ కు గుండె పోటు సంకేతాలు కనిపించాయి. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే తుది శ్వాస విడిచాడని వైద్యులు నిర్థారించారు. ఆఖరి క్షణాల్లో చేసిన వైద్యం పునీత్ ను బతికించలేకపోయింది. ఇప్పుడు మంత్రి గౌతమ్ రెడ్డికి కూడా వేకువజామున గుండెపోటు సంకేతాలు కనిపించాయి. వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభించారు. కానీ, వైద్యుల చేసిన ఆఖరి ప్రయత్నాలు ఫలించలేదు. తుది శ్వాసను గౌతమ్ రెడ్డి విడిచాడు. దీంతో యావత్త తెలుగు ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. ఫార్టీ ప్లస్ లోనే పునీత్ రాజ్ కుమార్, మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించడం గమనార్హం. వాస్తవంగా ఇద్దరికీ గతంలో గుండెపోటు సంకేతాలు లేవు. హఠాత్తుగా శరీర నాళాల్లో జరిగిన పరిణామం కారణంగా ప్రాణాలు కోల్పోయారని కొందరు వైద్యులు చెబుతున్నారు. 49 ఏళ్ల మంత్రి గౌతమ్ రెడ్డి, 46 ఏళ్ల హీరో పునీత్ రాజ్ కుమార్ మరణాల వెనుక గుండెపోటు కంటే ఇతరత్రా వ్యాయామ సమయంలో వచ్చే శారీరక మార్పులుగా అనుమానిస్తున్నారు. వాళ్లిద్దరూ ఒకేలా మరణించిన ఆనవాళ్లను వైద్యులు గమనిస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే జరిగిన మరణాల వెనుక ఉన్న రహస్యాలపై వైద్య నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ఏదైమైనా, ఇటీవల పునీత్ ఇప్పుడు గౌతమ్ రెడ్డి లేకపోవడం అభిమానులను శోకసంద్రంలో ముంచింది.